కేజీఎఫ్ 2కు క‌ళ్ళు చెదిరే పారితోషికం అందుకున్న య‌ష్‌..!

క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన బ్లాక్ బ‌స్టర్ చిత్రం కేజీఎఫ్‌. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం దాదాపు 200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో ఆ చిత్రానికి కొన‌సాగింపుగా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్. రెండో భాగం కోసం ఏకంగా 140 నుంచి 160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అయితే పెట్టిన ఖ‌ర్చుకు రెట్టింపు లాభాలు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కంతోనే నిర్మాత‌లు ఇంత భారీ రేంజ్‌లో చాప్ట‌ర్‌ను నిర్మించిన‌ట్టు తెలుస్తుంది.

కేజీఎఫ్ చిత్రంలో య‌ష్ సోలో ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఉతికి ఆరేశాడ‌నే చెప్పాలి. అందుకే సీక్వెల్‌లో కూడా య‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమాని తెర‌కెక్కించ‌గా, ఈ సినిమా కోసం ఆయ‌న దాదాపు 30 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు లాభంలో షేర్ కూడా తీసుకుంటున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్ళు పైగా డేట్స్ కేటాయించిన య‌ష్ ఆ మాత్రం రెమ్యున‌రేష‌న్ అందుకోవ‌డంలో త‌ప్పేమి లేదంటున్నారు ట్రేడ్ పండితులు. కేజీఎఫ్ తొలి పార్ట్ 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌డితే ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాలు పెంచేసుకున్న కేజీఎఫ్ 2 చిత్రం అంత‌కు మించిన వ‌సూళ్ళు రాబ‌డతాయ‌ని అంటున్నారు.

ఇక చాప్ట‌ర్ 2 లో న‌టించిన సంజ‌య్ ద‌త్, ర‌వీనా టాండ‌న్ వంటి స్టార్స్‌కు కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్టు టాక్. కొద్ది రోజుల క్రితం సినిమా షూటింగ్ పూర్తి కాగా, కొన్ని ప్యాచ్ వ‌ర్క్‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. వీలైనంత త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్‌లో సినిమాని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్. ఈ సినిమాను కేవలం ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్ప‌టికే అందుకు సంబంధించి స‌న్నాహాలు కూడా చేస్తున్నారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత అంద‌రి దృష్టి ఆకర్షించిన సౌత్ చిత్రం కేజీఎఫ్ 2 కాగా, ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు.