YS Jagan : 151 మంది ఎమ్మెల్యేల బలం వుంది వైసీపీ ప్రభుత్వానికి. అందులోంచి పది మందో, పాతిక మందో వెళ్ళిపోతే నష్టమేమన్నా వుంటుందా.? అంతమంది పార్టీని వీడే అవకాశం వుంటుందా.? అసలు ఒక్కరైనా వైసీపీని వీడతారా.? అంత సీన్ ఎవరికైనా వుందా.? లేదా.?
ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అంతా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఎఫెక్ట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారు, మడమ తిప్పారు. అది ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, రాజధాని అమరావతి విషయంలో కావొచ్చు.. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంలో కావొచ్చు.
పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయ వ్యూహాలు మార్చుకోవాల్సిందే. ప్రభుత్వ విధానాలూ అలాగే మారతాయి.. పార్టీ విధానాలూ అలాగే మారిపోతుంటాయ్.
అయినా, మాట మీద నిలబడాలంటూ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ప్రస్తుత అసంతృప్త నేతలెవరైనా, మాటకు కట్టుబడే ఇప్పటిదాకా రాజకీయాలు చేశారా.?
మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కావొచ్చు, మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎలా మారిపోతారు.? ఎలా పార్టీలో నిరసన గళం వినిపించగలుగుతారు.?
ముఖ్యమంత్రితో చర్చించాలి.. చర్చలు సఫలం కాకపోతే అప్పుడు నిరసన గళం విప్పినా అర్థం వుంటుంది. మేకతోటి సుచరిత సంగతి పక్కన పెడితే, మాజీ మంత్రి బాలినేని రాత్రికి రాత్రి తన స్టార్డమ్ కోల్పోయారు రాజకీయంగా.
ఇంత సిల్లీగా నిరసన గళం ఎలా వినిపిస్తారంటూ వైసీపీ నాయకత్వం ఆయన మీద గుస్సా అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే.. ఎవరికైనా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీంగా పుట్టగతులుండవంతే.
