YSRCP Own Surveys : సొంత సర్వేలు వైసీపీని భయపెడుతున్నాయా.?

YSRCP Own Surveys :ఏ రాజకీయ పార్టీ అయినా సొంత సర్వేలు చేయించుకోవడం కొత్తేమీ కాదు. కింది స్థాయిలో పరిస్థితులపై అంచనా వేసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. అధికారంలో వున్నవారికి ఇలాంటి సర్వేల పరంగా చూసుకుంటే కొన్ని వెసులుబాట్లు వుంటాయి. అవే ఆయా సందర్భాల్లో దెబ్బ కొడుతుంటాయి కూడా.

2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతంగా సర్వేలు చేయించుకుంటోందట. థర్డ్ పార్టీ సర్వేలు కూడా జరుగుతున్నాయట. వాటి వివరాల్నీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెప్పించుకుంటున్నారట. ప్రస్తుతం మీడియా, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం, వైసీపీ సొంత సర్వేల్లో ఆ పార్టీకి 100 నుంచి 130 వరకూ అసెంబ్లీ సీట్లు 2024 ఎన్నికల్లో వచ్చే అవకాశముందని తేలిందట.

ఒకవేళ ప్రచారంలో వున్న సర్వే ఫలితాలే వైఎస్ జగన్ ముందుకు వెళ్ళి వుంటే, వైసీపీ చేయించుకున్న సర్వేల్లోనే పై లెక్కలు వున్నమాట నిజమైతే, వైసీపీ చాలా చాలా అప్రమత్తంగా వుండాలి. అధికారంలో వున్న పార్టీలు చేయించుకునే సర్వేల్లో ముమ్మాటికీ వారికే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అది చరిత్ర చెబుతున్న సత్యం.

ఇలాంటి సొంత సర్వేల కారణంగా అనవసరపు అహంకారాలకు పోయి, అధికారాన్ని దూరం చేసుకుంటారు. చంద్రబాబు హయాంలో జరిగిందదే. 120 సీట్లు కొల్లగొట్టేస్తామన్న ధీమాతో అప్పట్లో టీడీపీ చెలరేగిపోయింది. ఫలితం 23 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది.

కాగా, వైసీపీ తమ వద్దకు వచ్చిన ఫలితాల్ని బేరీజు వేసుకుని, పార్టీ పటిష్టత కోసం గట్టి చర్యలు తీసుకోవాలనుకుంటోందిట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఈ ఫలితాల ఆధారంగానే శాసన సభ్యులకు అల్టిమేటం జారీ చేశారనీ, పార్టీకి సంబంధించి కీలక విభాగాల్ని అప్రమత్తం చేశారనీ అంటున్నారు.