Ventruka Peekaleru : ‘వెంట్రుక కూడా పీకలేరు’ అన్న మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట రావడం చాలామందికి రుచించలేదు. వైసీపీలోనే చాలామంది తమ అధినేత చేసిన వ్యాఖ్యల్ని సమర్థించలేక కిందా మీదా పడ్డారు.
ముఖ్యమంత్రి హోదాలో, అధికారిక కార్యక్రమంలో.. అందునా వేలాది మంది జనం చూస్తుండగా అలా ఎలా వైఎస్ జగన్ నోరు జారేశారు.? అన్న విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఇంతలోనే, వైఎస్సార్సీపీ జెండాల్ని తగలబెట్టేశారు.. వైసీపీ ఫ్లక్సీల్ని తగలబెట్టేశారు.. వైఎస్ జగన్ బొమ్మల్ని చించేవారు, దిష్టిబొమ్మల్ని కాల్చేశారు. ‘పీకడం’ అంటే ఇంతకన్నా ఇంకేముంటుంది.. ఇవన్నీ వైసీపీ నేతలు, కార్యకర్తలే చూశారు.
వైసీపీ కార్యకర్తలకు బీపీ వస్తే విపక్షాలు వణకడం కాదు, వైసీపీనే వణకాల్సిన పరిస్థితి వచ్చింది.
మంత్రివర్గ కూర్పు అనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి లోబడి వుంటుంది. ఎవర్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పరిపాలన మెరుగ్గా చేయగలననేదానిపై ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చి, తదనుగుణంగా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది సహజంగానే జరిగే ప్రక్రియ.
కానీ, కులం పేరుతో.. మతం పేరుతో.. ప్రాంతం పేరుతో రాజకీయాలు జరుగుతున్న రోజులివి. కుల సమీకరణాలు చూసుకోవాలి, మత సమీకరణాలు చూసుకోవాలి.. అన్నీ చూసుకోవాలి. అధికారంలోకి వచ్చేటప్పుడు చేసే ప్రమాణానికీ, ఆ తర్వాత చేసే పనులకీ అస్సలు పొంతన వుండదు. ఇది జగమెరిగిన సత్యం.
అందర్నీ మార్చేస్తానని చెప్పి, కొందర్నే మార్చడం వల్ల వచ్చింది ఈ పరిస్థితి. ఆనందంగా రాజీనామాలు అందించినోళ్ళు, ఇప్పుడెందుకిలా రచ్చ చేస్తున్నారన్న విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా వుంటుందా.? పార్టీ పదవులిస్తాం.. నామినేటెడ్ పదవులిస్తాం.. అంటే, అది ఆయా నేతల్ని మభ్యపెట్టడం తప్ప మరోటి కాదు.
నిజానికిది వచ్చే ఎన్నికలకోసం తయారైన క్యాబినెట్. ఈ సమయంలో ఇంత వ్యతిరేకత అంటే, జెండా పీకేసే పరిస్థితికి పార్టీని వైసీపీ అధినేతే తీసుకొచ్చారన్న విమర్శల్లో వాస్తవం లేదని ఎలా అనుకోగలం.?
