Reddy’s In YSRCP : మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తాలూకు సెగలు ఇంకా ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అసంతృప్తుల్ని బుజ్జగించే ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినా.. ‘మన ప్రభుత్వంలో మనకి మనం తగిన గౌరవమిచ్చుకోలేకపోతున్నాం.. తగిన అవకాశాల్ని కల్పించుకోలేకపోతున్నాం..’ అంటూ పలువురు ‘రెడ్డి’ సామాజిక వర్గ నేతలు వాపోతున్నారట.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఈ పేర్లు ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందినవే కదా.? రోజా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. కానీ, అసలు చర్చ వేరే. ‘కమ్మ’ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి పదవీ ఇవ్వకపోవడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ‘మీకైతే ముఖ్యమంత్రి సహా నలుగురు.. కమ్మ సామాజిక వర్గానికి ఒక్కటి కూడా ఇవ్వరా.?’ అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
రకరకాల లెక్కలేసుకుని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలామంది ఆశావహుల్ని పక్కన పెట్టి మరీ, మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆశావహుల లెక్క ప్రకారం చూసినా, వైఎస్సార్సీపీ పుట్టినప్పటినుంచీ రెడ్డి సామాజిక వర్గం వైసీపీని పెంచి పోషించిన తీరు ప్రకారం చూసినా.. రెడ్డి సామాజిక వర్గానికి అధికంగా పదవులు దక్కి తీరాలి.
కానీ, ఈ విషయంలో వైఎస్ జగన్ రిస్క్ చేశారు. అలా రిస్క్ చేయడంతో రెడ్డి సామాజిక వర్గంలో అలజడి రేగింది. ‘మన పార్టీ మనకే అన్యాయం చేస్తోంది..’ అన్న భావన రెడ్డి సామాజిక వర్గంలో పెరిగిపోతోందట. అయితే, ఇదంతా నిజమేనా.? వైసీపీని కాదని రెడ్డి సామాజిక వర్గం ఇంకో పార్టీని ‘ఓన్’ చేసుకునేందుకు సాహసిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.
