Sajjala Rama Krishna : వైఎస్ షర్మిల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి కాకపోతే ఇంకెవరు మాట్లాడగలరు.? ‘పార్టీ పెట్టొద్దని షర్మిలకు సూచించాం. ఆమె మా మాట వినలేదు. అందుకే, ఆ పార్టీతో మాకు సంబంధం లేదు.
అన్నాచెల్లెళ్ళ మధ్య అనుబంధం అలాగే వుంటుంది..’ అంటూ అప్పట్లో సజ్జల చేసిన వ్యాఖ్యలపై షర్మిల కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డికి వున్న ప్రత్యేకమైన స్థానమేంటో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంత బలంగా సజ్జలను ఎందుకు నమ్ముతారో అందరికీ తెలుసు. సజ్జల కాకపోతే ఎవరు.? అన్న ప్రశ్నకు వైసీపీలో సమాధానమే లేదు.. అది ఏ విషయంలో అయినా. ప్రభుత్వంలో అయినా, పార్టీలో అయినా సజ్జల మాటకు తిరుగు లేదు.
వైవీ సుబ్బారెడ్డి టీటీడీకే పరిమితమైనా, విజయసాయిరెడ్డి కూడా కొంతకాలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొన్ని విషయాల్లో దూరంగా జరగాల్సి వచ్చినా.. అదంతా సజ్జల ఎఫెక్టేనని అంటారు చాలామంది వైసీపీ నేతలు.
ఇప్పుడు కొత్త మంత్రివర్గ కూర్పు విషయంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానే అయి చక్రం తిప్పారు. మొత్తంగా అందర్నీ మార్చేద్దామని ముఖ్యమంత్రి అనుకుంటే, పార్టీలో అసంతృప్తి సెగలు పతాక స్థాయికి చేరతాయని భావించి, పాతవారిలో చాలామందిని కొనసాగించేలా సజ్జల, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారట.
నిజానికి, ఎవరెవరైతే సజ్జలతో ముందుస్తుగా టచ్లోకి వెళ్ళారో, వాళ్ళకు మాత్రమే పదవులు దక్కాయనే ప్రచారమూ జరుగుతోంది. ‘సజ్జల మాకు అన్యాయం చేశాడు..’ అంటూ పలువురు వాపోతున్నారంటే, తెరవెనుక ఏం జరిగి వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
