తెలుగుదేశం పార్టీలో నిష్క్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలే బయాభై చెప్పి వైసీపీ గూటికి చేరిపోతుండగా సీనియర్ నాయకులు సైతం అదే బాట పడుతున్నారు. ఇక్కడ సీనియర్ నాయకులంటే రాజకీయాల్లో సీనియర్లు కాదు టీడీపీ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకులు. వీరంతా వెళ్తూ వెళ్తూ చెబుతున్న మాట చంద్రబాబు నాయుడు మూలంగానే పార్టీని వీడుతున్నాం అని. దీంరతో చంద్రబాబు మీద తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆయన మూలంగానే పార్టీ బలహీనపడుతోందనే అభిప్రాయం బలపడుతోంది.
తాజాగా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్బై చెప్పారు. తనను నిర్లక్ష్యం చేయడం, పార్టీ పనుల్లో విలువ లేకపోవడం వలనే మనస్థాపం చెంది పార్టీని వీడుతున్నట్టు గద్దె బాబూరావు తెలిపారు. బాబూరావు 1994, 1999 ఎన్నికల్లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎన్ఠీఆర్ హయాంలో ఆయన హవా బాగానే నడిచింది. విజయనగరం జిల్లా రాజకీయాలను ఆయన ద్వారానే నడిపేవారు ఎన్టీఆర్. కానీ పగ్గాలు బాబు చేతికి వచ్చాక చాలామంది సీనియర్లలానే ఈయన కూడ నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు.
కొన్నేళ్లుగా ఆయనకు ఆ విలువ కూడ లేకుండా పోయింది. 2004, 2009 ఓటమి తర్వాత ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టేశారు. జిల్లా రాజకీయాల్లో అసలు ఆయన పాత్రే లేకుండా పోయింది. గతంలో పలుసార్లు ఇదే విషయాన్ని చెప్పుకుని బాధపడిన ఆయన ఈసారి రాజీనామా చేసేశారు. తన రాజీనామాకు కారణం చంద్రబాబే అన్నట్టు మాట్లాడారు. అన్నగారు చెప్పిన ఆత్మగౌరవం ఆత్మస్థైర్యం పార్టీలో లేవని అన్నారు. ఆయన లాంటి సీనియర్ లీడర్ పార్టీని వీడటం విజయనగరంలో టీడీపీకి లోటనే అనాలి.