Home Minister Anitha Slams YSRCP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని వైసీపీ పట్టుబడుతున్న నేపథ్యంలో, హోం మంత్రి వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, అయితే వైసీపీ నేతలు కేవలం ఆరోపణలు చేయడం కాకుండా తగిన ఆధారాలతో సభకు రావాలని ఆమె సవాల్ విసిరారు.
తిరుమల లడ్డూ తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని, అది పలు రసాయనాల మిశ్రమమని సిట్ (SIT) నివేదికలో తేలిందని అనిత పేర్కొన్నారు. “ప్రజల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంపై చర్చించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే సభలో సుముఖత వ్యక్తం చేశారు. ప్రజాహితం కోసం ఏ చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ఆమె వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా పాల సేకరణ సామర్థ్యం కూడా లేని సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారని అనిత మండిపడ్డారు. గతంలో ‘పింక్ డైమండ్’ పేరుతో అసత్య ఆరోపణలు చేసి సభా సమయాన్ని వృథా చేశారని, విచారణలో అసలు పింక్ డైమండే లేదని తేలిందని ఆమె గుర్తు చేశారు.

వైసీపీ నేతలు కేవలం సాక్షి పేపర్లో వచ్చే రాతలనే మాట్లాడుతుంటారని, గత ఐదేళ్లలో ప్రకటనల రూపంలో ఆ పత్రికకు రూ. 600 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారని విమర్శించారు.
మదనపల్లిలో చిన్నారి హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకోవడంపై కూడా అనిత స్పందించారు. చేసిన తప్పుకు మనస్తాపం చెందే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె అభిప్రాయపడ్డారు. భగవంతుడితో పెట్టుకున్న ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని, వైసీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు.
మొత్తంమీద తిరుమల నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో జరగబోయే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికార పక్షం విసిరిన ఈ సవాల్పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

