Bandla Ganesh Sankalpa Yatra: ముగిసిన బండ్ల గణేశ్ విజయ సంకల్ప యాత్ర.. తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న నటుడు

Bandla Ganesh Sankalpa Yatra: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన భక్తిని, కృతజ్ఞతను చాటుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి క్షేమంగా విడుదలవ్వాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన మొక్కుకున్న ‘విజయ సంకల్ప యాత్ర’ నేటితో విజయవంతంగా ముగిసింది.

జనవరి 19న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని తన నివాసం నుంచి బండ్ల గణేశ్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. గత 23 రోజులుగా ఎండను, వడగాల్పులను లెక్కచేయకుండా దాదాపు 500 కిలోమీటర్లకు పైగా నడుస్తూ తిరుపతికి చేరుకున్నారు. దారిపొడవునా ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

నిన్న రాత్రి తిరుపతికి చేరుకున్న ఆయన అలిపిరి వద్ద బస చేశారు. ఈ రోజు ఉదయం అలిపిరి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి, సాంప్రదాయబద్ధంగా కాలినడకన కొండపైకి బయల్దేరారు. తిరుమల చేరుకున్న అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తన మొక్కును చెల్లించుకున్నారు.

చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే.. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

“చంద్రబాబు గారు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని, మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఆ శ్రీవారిని కోరుకున్నాను. నా కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకే ఈ విజయ సంకల్ప యాత్ర చేపట్టాను. స్వామివారి కృపతో అనుకున్నది సాధించాను” అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం బండ్ల గణేశ్ పాదయాత్ర పూర్తి చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

BRS Party Manju Rani Fires On CM Revanth Reddy || KCR || Congress Party || BRS || Telugu Rajyam