SARA Chandrababu : ‘అధికారం కోల్పోతానని తెలిసి, చివరి సమయంలో చెత్త బ్రాండ్లకు సంబంధించిన డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. మా హయాంలో కొత్తగా మేం ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు..’ అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. ‘ఆయన తన పేరుని నారా చంద్రబాబునాయుడు కాదు.. సారా చంద్రబాబునాయుడు అని మార్చుకోవాలి..’ అంటూ వైఎస్ జగన్ సెటైర్లు వేశారు.
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త బ్రాండ్ల మద్యంపై పెద్దయెత్తున దుమారం చెలరేగుతున్న విషయం విదితమే. ప్రెసిడెంట్ మెడల్ అనీ, ఇంకోటనీ.. పూటకో కొత్త బ్రాండ్ పుట్టుకొస్తోంది. ఈ బ్రాండ్ల మద్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలు, ‘జగనన్న మద్యం బ్రాండ్లు..’ అంటూ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఆయా బ్రాండ్ల అసలు గుట్టుని బయటపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. అంతా బాగానే వుందిగానీ, చంద్రబాబు హయాంలో ఏర్పాటైన అమరావతి విషయంలోనే తమదైన నిర్ణయాలు తీసుకోగలిగిన వైఎస్ జగన్ సర్కారు, మద్యం బ్రాండ్ల విషయంలో ఎందుకు చంద్రబాబు నిర్ణయాల్ని కొనసాగిస్తున్నట్లు.?
పైగా, చంద్రబాబు హయాంలో లేని చెత్త బ్రాండ్ల మద్యం ఇప్పుడెందుకు రాష్ట్రంలో ఏరులై పారుతుందో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలకు సమాధానమివ్వాల్సి వుంది. అధికారంలోకి వస్తూనే బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపినట్లే, కల్తీ బ్రాండ్లపైనా ఉక్కుపాదం మోపితే, ప్రభుత్వమిప్పుడిలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చి వుండేది కాదు. చిత్రమేంటంటే, వైఎస్ జగన్ సర్కారు కొత్త మద్యం పాలసీ తెచ్చాకనే ఈ చెత్త బ్రాండ్లు రంగ ప్రవేశం చేశాయ్.
