Ys Jagan : ఉద్యోగుల కోసం మిగతా రాష్ట్రాల కంటే చాలా చాలా ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.. సంక్షేమం విషయంలోనూ అంతే. ఏ విభాగం చూసుకున్నా, ఖర్చుల పరంగా ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డులు సృష్టించేస్తోంది. ఖర్చు సరే, ఆదాయం సంగతేంటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.
చంద్రబాబు హయాంలోనూ అప్పులు జరిగాయి.. అదీ రికార్డు స్థాయిలో. అప్పట్లో ఆ అప్పుల్ని వైఎస్ జగన్ అండ్ టీమ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైసీపీ హయాంలో అప్పులు మరింతగా పెరిగిపోయాయ్.. పెరిగిపోతూనే వున్నాయ్. చంద్రబాబు రికార్డుల్ని ఏనాడో వైఎస్ జగన్ కొల్లగొట్టేశారు.
చేసిన అప్పుల తాలూకు సొమ్ములు ఏమైపోతున్నాయ్.? అంటే, ‘సంక్షేమం’లోకి వెళ్ళిపోతున్నాయ్. ఔను, సంక్షేమమంటే సముద్రం. అందులోకి వెళ్ళడమే తప్ప, అట్నుంచి తిరిగి రావడం కష్టమే. ఈ సూత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదా.? అంటే, తెలియదని కాదు.. కానీ, ఓటు బ్యాంకు రాజకీయం చేయాల్సిందే తప్పదు.
రేప్పొద్దున్న ఇంకెవరు అధికారంలోకి వచ్చినా అప్పుల కోసం వెంపర్లాడాలి తప్ప, అభివృద్ధి చేయడానికి ఆస్కారమే వుండకపోవచ్చు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యమనో, రాష్ట్ర రాజధానికి సహకరించమనో, ఇంకోటనో కేంద్రాన్ని వైఎస్ జగన్ సర్కారు చిత్తశుద్ధితో ప్రశ్నించే పరిస్థితి లేదు. అప్పు చేయడానికి అవకాశమిస్తే చాలని దేబిరించడంతోనే సరిపోతోంది మరి.
ఇలా ఇంకెన్నాళ్ళు.? ఇంకెన్నేళ్ళు.? వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇంకో పదేళ్ళయినా రాష్ట్రానికి రాజధాని వుండదు. పోలవరం ప్రాజెక్టూ పూర్తవదు. సంక్షేమమే అన్ని అనర్ధాలకీ కారణం.. అని జనం తెలుసుకునే రోజెంతో దూరంలో లేదు.
