YSRCP Ex Ministers : వైసీపీ ఎమ్మెల్యేలలో సగం మంది తిరిగి గెలిచే అవకాశం లేదంటూ ప్రశాంత్ కిషోర్ టీమ్ ఓ నివేదిక ఇచ్చిందనే ప్రచారం గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఈ విషయమై వైసీపీ అధిష్టానానికీ ఖచ్చితమైన సమాచారం వుంది.
ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళుతోంటే, సొంత పార్టీ కార్యకర్తలే కొన్ని చోట్ల ఏవగించుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది.
కారణాలేవైనప్పటికీ, ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు పెద్దగా అభ్యంతరాల్లేకపోయినా, ఎమ్మెల్యేల పనితీరుపై చాలా ఫిర్యాదులున్నాయి. కొందరు మంత్రులపైనా అదే స్థాయి వ్యతిరేకత వుండడంతోనే.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ‘ఆ కోటా’ కింద పలువుర్ని తప్పించారనే ప్రచారం జరుగుతోంది.
సరే, మంత్రి పదవుల్ని తీసేశారు.. పార్టీ పదవులని అంటున్నారు. ఆ పదవులు వస్తాయో లేవో తెలియదు. పార్టీ పదవుల సంగతెలా వున్నా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు వుండాలి కదా.? అన్న చర్చ వైసీపీ ఎమ్మెల్యేలలో జరుగుతోంది.
ఎవరెవరికి టిక్కెట్ ఇంకోసారి దక్కదన్న విషయమై వైసీపీ ఎమ్మెల్యేలలోనూ కొందరి వద్ద ఖచ్చితమైన సమాచారం వుందట. అలాంటోళ్ళు సహజంగానే పక్క పార్టీల వైపు చూస్తారు. అలా టీడీపీ వైపు చూసిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకి అనూహ్యంగా మంత్రి పదవి దక్కిందట.
దాంతో రాత్రికి రాత్రి ఆ వైసీపీ ఎమ్మెల్యే మనసు మారిందని అంటున్నారు.
ఇదంతా నిజమేనా.? వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీనో ఇంకో విపక్షమో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మైండ్ గేమ్ ఆడుతోందా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.
