Jagan Sarkar : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల్లో పరిపాలన వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. జిల్లాకి ఓ కలెక్టర్ సహా, ఇతర కీలకమైన అధికారులకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పరిపాలనా భవనాలు వంటి వాటి విషయమై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు చేసింది.
కొత్త జిల్లాలకు సంబంధించి వచ్చిన అనేక అభ్యంతరాల్ని ప్రభుత్వం లోతుగా పరిశీలించింది. అయితే, ముందస్తుగానే కొత్త జిల్లాల విషయమై పూర్తిస్థాయిలో కసరత్తులు చేశామని జగన్ సర్కారు చెబుతున్న దరిమిలా, కొత్త జిల్లాల విషయమై పెద్దగా మార్పులు చేర్పులు వుండకపోవచ్చునని సమాచారం.
అభ్యంతరాలు వచ్చిన చోట్ల స్థానికంగా పరిస్థితులు చక్కదిద్దేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబోతున్నారట. అవేంటన్నదానిపై ముందు ముందు స్పష్టత రాబోతోంది. జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల విషయమై పెద్దగా మార్పులు వుండకపోవచ్చునని తెలుస్తోంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, తెలంగాణలో జిల్లాల పునర్ విభజన జరిగిన విషయం విదితమే. అప్పట్లో 10 జిల్లాలున్న తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలున్నాయి. ఆ లెక్కన, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత 33కి పైగానే కొత్త జిల్లాలు వుండాల్సింది.
అయితే, పరిపాలనా సౌలభ్యం సహా అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, లోక్సభ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కొత్త జిల్లాల్ని జగన్ సర్కారు ఏర్పాటు చేస్తోంది. 26 జిల్లాల ఆంద్రప్రదేశ్ ముఖచిత్రాన్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించేసింది.
చిన్న చిన్న మార్పులు మినహా పెద్దగా మార్పులేమీ వుండవనే ప్రచారం జరుగుతున్న దరిమిలా, ఆయా ప్రాంతాల్లో వచ్చిన, వస్తున్న అభ్యంతరాలు ముందు ముందు పెద్ద వివాదాలుగా మారతాయా.? వేచి చూడాల్సిందే.
