Mekapati Gowtam Reddy : జగన్ మంత్రి వర్గంలోకి దివంగత గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీ కీర్తి.?

Mekapati Gowtam Reddy : గుండె పోటుతో ఇటీవల అకాల మరణం చెందిన గౌతమ్ రెడ్డి విషయమై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా కుదుటపడలేదు. అత్యంత సన్నిహితుడ్ని కోల్పోయానంటూ తాజాగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

ఇక, కొత్త మంత్రి వర్గాన్ని త్వరలో ప్రకటించనున్న వైఎస్ జగన్, ఆ మంత్రి వర్గంలోకి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిని తీసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయమై ఇప్పటికే మేకపాటి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాచారం పంపించారంటూ ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి శ్రీ కీర్తి ఏనాడూ రాజకీయ తెరపై కనిపించలేదు. విద్యావంతురాలే అయినా, మంత్రి గౌతమ్ రెడ్డి రాజకీయ పరమైన కార్యక్రమాలకు దూరంగా వుంటూ వచ్చారామె. కానీ, గౌతమ్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన సతీమణి మీద పడింది.

వైఎస్ జగన్ ఇటీవల శ్రీ కీర్తితో ఇదే విషయమై చర్చించారనీ, రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరారనీ, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఈ విషయమై సానుకూలంగానే వున్నారనీ తెలుస్తోంది. వృద్ధాప్యం కారణంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయులు మరో ఇద్దరు వున్నా, వారికి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదట. మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణికి మంత్రి పదవి ఇవ్వడమే సబబన్న చర్చ వైసీపీ వర్గాల్లోనూ జరుగుతున్న దరిమిలా, వైఎస్ జగన్ మరో ఆలోచన లేకుండా మంత్రి వర్గంలోకి శ్రీకీర్తిని తీసుకునే విషయమై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.