Liquor Consuming : మద్యపానం ఆరోగ్యానికి హానికరమా.? కాదా.?

Liquor Consuming : మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటూ ప్రకటనలు గుప్పించడం ప్రభుత్వాలకు కొత్తేమీ కాదు. అందుకే, తరచూ మద్యపాన నిషేధం అనే అంశం చర్చకు వస్తుంటుంది. అయితే, మద్యం వల్ల ప్రభుత్వాలకి వచ్చే ఆదాయం చాలా చాలా ఎక్కువ. అందుకే, మద్య నిషేధం లేదా మద్య నియంత్రణ విషయంలో ఎవరు అధికారంలో వున్నా దాదాపుగా ఒకేలా వ్యవహరిస్తారు.
అయితే, తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నియంత్రణ చేసి, చివరికి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని 2019 ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పింది. కానీ, అధికారంలోకి వచ్చాక వైసీపీ మద్య నియంత్రణను పక్కన పెట్టింది. ధరలు పెంచి మద్యం ప్రియులకు షాకిచ్చి, తద్వారా మద్య నియంత్రణ చేస్తామని చెప్పారుగానీ, ఆ తర్వాత వేరే కారణాలు చూపి మద్యం ధరల్ని తగ్గించి మద్యపానాన్ని పరోక్షంగా ప్రోత్సహించినట్లే వ్యవహరించారు.
ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో దొరుకుతోన్న వింత రకాలైన బ్రాండ్ల మద్యం కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ‘అబ్బే, ఆ మద్యం వల్ల ప్రజల ప్రాణాలకు ఎలాంటి హానీ లేదు..’ అంటూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోంది.
ఏ బ్రాండ్ మద్యమైనాసరే, ఆరోగ్యానికి హానికరమే. ఆ విషయాన్ని పక్కన పెట్టి, రాష్ట్రంలోని మద్యం వల్ల ప్రాణ హాని లేదని ప్రభుత్వం చెప్పడమేంటి.? పైగా, కొత్త మద్యం బ్రాండ్ల వద్ద ప్రజారోగ్యానికి ప్రమాదమని విపక్షాలు విమర్శిస్తోంటే, వాళ్ళపై ‘పరువు నష్టం’ కింద కేసులు పెట్టడమేంటో.! మద్యపానం ప్రజారోగ్యానికి హానికరమా.? కాదా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెదవి విప్పాల్సిందే.