Bandi Sanjay : ‘కేసీయార్ని జైలుకు పంపుతాం.. ఇది పక్కా..’ అంటూ శపథం చేసేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ‘ఏం, ముఖ్యమంత్రిని జైలుకు పంపుతానంటావా.? నేను తలచుకుంటే నువ్వేమౌతావ్.?’ అంటూ కేసీయార్ కూడా మాటలు జారేశారు.
ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు శిక్ష అనుభవించి తీరాల్సిందే. కానీ, అసలు ప్రజాస్వామ్యమెక్కడుంది.? పోలీసు వ్యవస్థ అధికార పార్టీల కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. అధికారంలో ఎవరుంటే వాళ్ళకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ నడచుకుంటోంది.
న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక అనుమతులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం, బండి సంజయ్ రాజకీయ ఆందోళన విషయంలో మాత్రం ఉక్కుపాదం మోపింది. పోలీసులు, బండి సంజయ్ని కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా అరెస్టు చేసేశారు. చిత్రమేంటంటే, ఇలాంటి కేసుల్లో బెయిల్ పొందడం రాజకీయ నాయకులకు కొత్తేమీకాదు. కానీ, బెయిల్ రాలేదు బండి సంజయ్కి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు జైల్లో బండి సంజయ్ని కలిశారు. బండి సంజయ్ కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైద్రాబాద్కి వస్తుండడం.. పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది.
‘ఇక ఖేల్ ఖతం.. కేసీయార్ జైలుకెళ్ళడమే తరువాయి..’ అంటున్నారు కమలనాథులు. అంతేనా, రాజకీయాల్లో కక్ష సాధింపులు తప్ప ఇంకేమీ వుండవా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.