YSRCP With New Ministers : పదవులు తీసుకున్నారు సరే.! పార్టీకి ఏంటి ఉపయోగం.?

YSRCP With New Ministers : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పాతవారిలో చాలామందిని కొనసాగిస్తూ, కొందరు కొత్తవారికీ మంత్రి వర్గంలో చోటు కల్పించారు.

పాత, కొత్త కలయికతో మంత్రి వర్గం సమకూర్పు.. చూడ్డానికి బాగానే వుందా.? అంటే, వైసీపీ దృష్టిలో అదుర్స్.. అని చెప్పక తప్పదు. కానీ, అలకపాన్పు ఎక్కినవారి మాటేమిటి.? బుజ్జగింపులు కొనసాగుతున్నాయ్.

రాజకీయాల్లో పైకి కనిపించే వ్యవహారాలకీ.. తెరవెనుకాల వ్యవహారాలకూ అస్సలు పొంతన వుండదు. టైటానిక్ షిప్ ఎందుకు మునిగిపోయింది. పైకి చిన్నదిగా కనిపించే ఓ ఐస్‌బర్గ్‌ని చూసి ‘డ్రైవరుగారు’ లైట్ తీసుకోవడం వల్లనే. వైసీపీలో అసంతృప్తి సెగల వ్యవహారం కూడా అంతే.

బుజ్జగింపులతో ఆల్ ఈజ్ వెల్.. అనిపిస్తున్నా, కింది స్థాయిలో పరిస్థితి చాలా దారుణంగా వుంది.

రోజా విషయాన్ని తీసుకుంటే ఆమెకు మంచి వాగ్ధాటి వుంది. కానీ, ఏం లాభం.? సొంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వుంది. అదే వైసీపీకి శాపం. ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకుడు.

కానీ, ఆయనకు మంత్రి పదవి దక్కడంతో జిల్లాలో రాజకీయాలు వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయాయ్. మరో మంత్రి సీదిరి అప్పలరాజుకి పార్టీని గెలిపించేంత సీన్ లేదని వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారాయె.

ఇలా ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అలాగని, తాజా మాజీలేమైనా పార్టీని ఉద్ధరించేశారా.? ఉద్ధరించేస్తారా.? అంటే, అదీ లేదాయె. కేవలం జగన్ ఇమేజ్ మీదనే వైసీపీ నడవాలి. కానీ, వైసీపీ అనే పడవకి.. సోకాల్డ్ వైసీపీ నేతలు ఒకరొకరుగా చిల్లులు పెట్టుకుంటూ పోతే, మునిగిపోవడం ఖాయమే కదా.?