Cine Politics : రాజకీయాల్లో నో డౌట్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే పై చేయి. మరి, సినిమా రాజకీయాల సంగతేంటి.? ‘వకీల్ సాబ్’ సినిమాని తొక్కేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి మంత్రులు కూడా తమ స్థాయిని దిగజార్చేసుకుని, ‘వకీల్ సాబ్’ సినిమాలకి రివ్యూలిచ్చేశారు.. అదీ నెగెటివ్ యాంగిల్లో.
‘రీమేక్ సినిమా.. దాన్ని ఎవడూ చూడలేదు.. ఫ్లాప్ సినిమా.. డిజాస్టర్ సినిమా..’ అంటూ మంత్రులు వ్యాఖ్యానించడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. అయినా, ‘వకీల్ సాబ్’ సినిమా జోరు తగ్గలేదు. పైగా, సినిమా అంచనాలకు మించి వసూళ్ళను సాధించింది.. కరోనా పాండమిక్ సమయంలో. ‘వకీల్ సాబ్’ వసూళ్ళ వివరాల్ని సదరు మంత్రులే ఆ తర్వాత వెల్లడించాల్సి వచ్చింది.. ‘తెలంగాణలో కంటే
ఆంధ్రప్రదేశ్లోనే వకీల్ సాబ్ ఎక్కువ వసూళ్ళకు పాల్పడింది’ అని.
మరి, ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో ఏం జరగబోతోంది.? నో డౌట్, సినీ రాజకీయం విషయంలో పవన్ కళ్యాణ్దే పైచేయి. సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించగలరేమోగానీ, సినిమా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామాని ఆపలేరు కదా.? కటౌట్లు, బ్యానర్లు.. ఆ హంగామా అనూహ్యంగా వుంటోంది. ఇప్పటికే సంబరాలు కూడా షురూ అయ్యాయి.
ప్రభుత్వం, ఏ సినిమాకీ చేయని విధంగా ‘భీమ్లానాయక్’ సినిమా వసూళ్ళ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. టిక్కెట్ల ధరల విషయమై పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. బెనిఫిట్ షోలు లేవు, అదనపు షోలకీ ఆస్కారమివ్వలేదు. దీంతో, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు నష్టపోయే అవకాశముంది.
ఈ నేపథ్యంలో, కొన్ని చోట్ల అభిమానులు ‘హుండీల్ని’ ఏర్పాటు చేశారు. తమకు తోచినంత ఆ హుండీల్లో వేయాల్సిందిగా సాటి అభిమానుల్ని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ కనిపించలేదు. నిజానికి, టిక్కెట్ల ధరల్ని ప్రభుత్వం తగ్గించడం ద్వారా పవన్ కళ్యాణ్ మీద ఆ ప్రభావం ఏమీ పడదు. ఆ విషయం తెలియనంత అమాయకులైతే కాదు ప్రభుత్వాన్ని నడుపుతున్నోళ్ళు. మరెందుకీ రచ్చ.?
