Big Political Mistake By YSRCP : ఉద్యోగులపై విష ప్రచారం: అధికార వైసీపీకి పెను ముప్పు.!

Big Political Mistake By YSRCP :  కరోనా కష్ట కాలంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. ఇంతకీ, ప్రభుత్వం ఏం చేస్తోంది.? అధికార వైసీపీ నుంచి ఉద్యోగుల సమస్యలపై ఎవరైనా చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నారా.? ఈ విషయమై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. ఇదైతే వాస్తవం. మరి, ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల బాగోగులు చూసుకోవాలి కదా.? ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ఆత్మ విమర్శ ప్రభుత్వ పెద్దల్లో జరగాలి. కానీ, ప్రభుత్వంలో ‘పెద్దలం’ అని చెప్పుకునే కొందరు మాత్రం, ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యమం అనివార్యమయినట్లు కనిపిస్తోంది ఉద్యోగులకి.

‘కామన్ మ్యాన్’ పేరుతో అధికార వైసీపీకి చెందిన అనుకూల మీడియా చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తోంది. ‘ఉద్యోగుల జీతాలు పెరిగాయ్.. కానీ, గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు.. సంక్షేమ పథకాల్ని అడ్డుకునేందుకే ఉద్యోగుల కుట్రలు..’ అంటూ సాగుతోంది వైసీపీ అనుకూల మీడియా ప్రచారం.

వైసీపీకి చెందిన కీలక నేతలు సైతం, ఉద్యోగుల తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడంలేదు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. ‘మేం ప్రభుత్వంలో భాగమే.. కానీ, మా సమస్యలు పరిష్కరించాలి..’ అంటూ ప్రభుత్వాన్నే వేడుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల్ని రెచ్చగొట్టడం వల్ల రాజకీయంగా వైసీపీ నష్టపోతుంది. ప్రభుత్వానికీ చెడ్డపేరు వస్తుంది. ఛలో విజయవాడ సూపర్ సక్సెస్ అవడమే కాదు, బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. లోపాల్ని సరిదిద్దుకోవాలి తప్ప, అధికార పార్టీ అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయించడం తగదు.