10 Old and 15 New Faces : 10 పాత, 15 కొత్త మొహాలు.! జగన్‌కి వేరే ఆప్షన్ లేదంతే.!

10 Old and 15 New Faces : మంత్రి వర్గానికి సంబంధించి కూడా కోటా విధించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మామూలుగా అయితే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినప్పుడు అధికారాన్ని పంచుకోవడం చూస్తాం.
151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన వైస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రి వర్గానికి కూడా కోటా విధించారు.. చెరో రెండున్నరేళ్ళన్నట్టు.
రెండున్నరేళ్ళలో కొత్త మంత్రి వర్గం వస్తుందని తొలి మంత్రి వర్గం సమయంలోనే ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదేం పంపకం.? అని చాలామంది ముక్కున వేలేసుకున్నా, అసంతృప్తి రేగకుండా వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న వాదనా లేకపోలేదు.
అదంతా గతం. ఇప్పుడు, కొత్త మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మళ్ళీ అంతా కొత్తవారే వస్తారని చాలామంది ఆశిస్తే, వారి ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. దాదాపు 10 మంది పాత మంత్రులకు అదనంగా 15 మంది కొత్త మంత్రుల వస్తారనే ప్రచారం జరుగుతోంది.
అనుభవం అనీ, సమర్థత అనీ.. ఏవేవో కారణాల్ని వైసీపీ చెబుతున్నప్పటికీ, ప్రస్తుత మంత్రులు అసంతృప్తికి గురైతే పార్టీ దెబ్బ తింటుందన్న కోణంలో, వారిని అదుపు చేయలేని దయనీయ స్థితిలోనే వైఎస్ జగన్, మాట తప్పాల్సి వస్తోందన్నది ఇంకో వెర్షన్.
అయితే, తెరవెనుకాల అసలేం జరుగుతోంది.? కొత్త మంత్రి వర్గంలో పాతవారెందరు.? కొత్తవారెందరు.? అన్నదానిపై అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సి వుంది. వైసీపీ అనుకూల మీడియా నుంచే లీకులు అందుతున్న దరిమిలా.. 10 పాత మొహాలు, 15 కొత్త మొహాలు కొత్త మంత్రి వర్గంలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.