గజిబిజి గందరగోళంగా ‘కెప్టెన్‌ మిల్లర్‌’!

తమిళ సినిమా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు. ధనుష్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా తమిళంలో సంక్రాంతికి అంటే జనవరి 12న విడుదల చేశారు. అక్కడ ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది ఒక పీరియడ్‌ డ్రామా, బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులనాటి కథ. ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌, తెలుగు నటుడు సందీప్‌ కిషన్‌ ప్రత్యేక పాత్రల్లో కనపడతారు.

ఈ సినిమాకి కథతో పాటు దర్శకత్వం కూడా అరుణ్‌ మతీశ్వరన్‌ చేశారు. ధనుష్‌ కెరీర్‌ లో ఈ సినిమా బ్జడెట్‌ ఎక్కువ పెట్టిన తీసినది. ఈ కథ బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో, సంస్థానాలు, రాచరికాలు కూడా వున్న ప్రదేశంలో, సుమారు 1930లో జరిగే కథ. అగ్నీశ్వర (ధనుష్‌) ఒక గ్రామంలో తన తల్లితో ఉంటూ ఉంటాడు, కానీ అతనికి, అతని సహచరులకు ఆ గ్రామంలో కుల వివక్ష కారణంగా గుడిలోకి అడుగుపెట్టనీయరు.

కనీసం గౌరవం సంపాదించాలంటే సైన్యంలో చేరితే వస్తుంది అని బ్రిటిష్‌ సైన్యంలో చేరతాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం అందరికీ పేర్లు మారుస్తూ ఉంటుంది, ఇతనికి మిల్లర్‌ అని కొత్త పేరు ఇస్తారు. బ్రిటిష్‌ సైన్యంలో ఉంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారతీయుల్ని చంపుతాడు మిల్లర్‌, అలా కొంతమందిని చంపాక కోపం వచ్చి తన పై వున్న బ్రిటిష్‌ అధికారిని చంపేస్తాడు.

బ్రిటిష్‌ ప్రభుత్వం మిల్లర్‌ ని పట్టుకోబోతే తోటి సైనికుడు రఫీక్‌ (సందీప్‌ కిషన్‌) సాయంతో తప్పించుకుంటాడు. అక్కడి నుంచి అగ్నీశ్వర అలియాస్‌ మిల్లర్‌ దొంగగా మారతాడు. ఒకసారి అగ్నీశ్వరని సిపాయిల బారి నుంచి ఆ ఊరి మహారాజు కుటుంబానికి చెందిన అమ్మాయి భానుమతి (ప్రియాంక అరుల్‌ మోహన్‌) రక్షిస్తుంది. దొంగగా మారిన మిల్లర్‌ కి ఊరి గుడిలోని విగ్రహాన్ని దొంగిలించి తెమ్మని చెబుతారు, అతను సరే అంటాడు. ఇంతకూ మిల్లర్‌ దొంగతనం చేసిన ఆ విగ్రహం ఎవరిది? దానికి ఆ ఊరుకి సంబంధం ఏంటి? శివన్న (శివరాజ్‌ కుమార్‌) ఎవరు, అతని పాత్ర ఏంటి? శివన్నకి, మిల్లర్‌ కి ఎటువంటి సంబంధం వుంది, ఇవన్నీ సినిమా కథగా మలిచారు. కుల వ్యవస్థ, పోరాటాలు సినిమా ప్రారంభం అవటం బాగానే వుంది, కానీ ఆ తరువాతే గాడి తప్పుతుంది.

ప్లాష్‌ బ్యాక్‌ లోకి కథ రావటం, మళ్ళీ ముందుకి వెనక్కి ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పూర్తిగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే సినిమాగా మలిచాడు దర్శకుడు. ఒక దశలో అయితే సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకుడు అనుకునేట్టు చేసాడు దర్శకుడు. కథ నేపథ్యం ఎప్పుడో 1930 సంవత్సరం కాలం నాటిది కానీ గ్రామంలో మగ్గుతున్న ప్రజలకి ఆధునిక ఆయుధాలు రావటం, అవి ప్రయోగించే విధానం తెలియటం ఆ పోరాట సన్నివేశాలు కథ ఎక్కడ నుంచే ఇంకో దగ్గరికి వెళ్లి అసలు ఏమి జరుగుతోందో కూడా అర్థం కాదు.

దర్శకుడు దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా మరింత మంచిగా సాగేది. చివరగా, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమా ఒక మంచి కథతో ప్రారంభం అవుతుంది, బ్రిటిష్‌ ప్రభుత్వ అండతో అక్కడ వున్న రాచరిక కుటుంబాలు ఒక కులం వారిని ఎలా అణగదొక్కుతున్నారు, ఇంకో పక్క బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకత ఈ నేపథ్యంలో ఉండాల్సిన కథ ఎక్కడికో వెళ్ళిపోయి ప్రేక్షకుడికి నిరాశ పరిచింది.