టెన్షన్ టెన్షన్: “6-1” కోసం బాబు… “7-0” కోసం జగన్!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన అనంతరం ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఈ విషయంమీదే హాట్ హాట్ గా మారాయి. ఈ పరిస్థితుల్లో జగన్ నమ్మకం జగన్ కి ఉంటే… బాబు వ్యూహం బాబుకుంది. మరి ఎవరికి అవకాశం ఉంది?

ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు 7 ఉండగా.. టెక్నికల్ గా వైసీపీ బలం 151+4+1= 156. అంటే వైసీపీ ఖాయంగా ఈ 7 సీట్లను గెలుచుకుంటుంది. ఇక టీడీపీకి టెక్నికల్ గా ఉన్న బలం 23-4=19. అంటే… టీడీపీ బరిలో దింపిన ఏకైక మహిళా అభ్యర్థి అనురాధ ఓడిపోవడం గ్యారెంటీ. పిక్చర్ ఇంత క్లియర్ గా ఉన్నా అందరూ ఈ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే… వైకాపా నేతలు తమతో టచ్ లో ఉన్నారు.. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది.. మా సీట్ మాకొస్తుంది అనే మాటలు టీడీపీ నుంచి వస్తున్నాయి!

ఇక వైసీపీ విషయానికొస్తే… వైసీపీ వాస్తవ బలం 151 సీట్లు మాత్రమే. టీడీపీ నుంచి 4, జనసేనకున్న ఒక్కటీ కూడా వైసీపీ ఖాతాలో ఉండటంతో… ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు తమకే ఓటేస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఈ స్థాయిలో వ్యూహాలు – నమ్మకాలతో ఉన్న ఈ ఎన్నికలో “బాబు వ్యూహానికి – జగన్ నమ్మకానికి” ఈరోజే రిజల్ట్ డే. ఈ ఫలితాలు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతాలుగా మారే సూచనలైతే లేకపోలేదు అనేది ఈ సందర్భంగా విశ్లేషకులు చెబుతున్న మాట.

అసెంబ్లీలోని కమిటీ హాల్‌ – 1లో ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌.. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలనుంచి కౌంటింగ్ మొదలు పెడతారు, గంటల వ్యవధిలోనే ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు అందరిలో నెలకొన్న ఆసక్తి. ఫలితం టీడీపీకి అనుకూలంగా ఉంటే మాత్రం.. అధికారపార్టీలో అంతర్గత సమస్యలు పుష్కలంగా ఉన్నట్లు – అధినాయకుడిపై అసహనంతో ఉన్నట్లు లెక్క. అలాకాకుండా.. వైసీపీ ఖాతాలో 7 సీట్లు పడితే మాత్రం.. “వైనాట్ 175” అంటూ వైసీపీ మరోసారి తొడకొట్టే అవకాశముంది.

సో… ఈ ఎన్నికలో 1 – 6 తో ఓడిపోయినా గెలిచినట్లేనని బాబు భావిస్తుంటే… 7 – 0 తో క్లీన్ స్వీప్ చేయాలని జగన్ ఆశిస్తున్న ఈ ఫలితాలు.. సాయంత్రం 6 – 7 గంటలకల్లా విడుదలయ్యే అవకాశం ఉంది!