వైఎస్ జగన్ ఏకైక టార్గెట్ పవన్ కళ్యాణ్.! కానీ, ఎందుకు.?

ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌నే టార్గెట్‌గా చేసుకుని రాజకీయ విమర్శల తీవ్రతను పెంచారు.

వైసీపీలో కింది స్థాయి నాయకుడు సైతం మాట్లాడకూడని వ్యక్తిగత దూషణ తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అధికార వేదికలపై మాట్లాడుతున్నారన్న విమర్శ జనసేన నుంచి వస్తోంది. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితాన్ని జనసేన నేతలు, అందునా జనసేన మహిళా నేతలు వాడుతున్నారు.

ఓ జనసేన మహిళానేత అయితే, టీడీపీ అనుకూల మీడియా సంస్థ ఒకటి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ‘వైఎస్ జగన్ పుట్టుక ఏంటి.?’ అంటూ అవమానకరమైన రీతిలో మాట్లాడారు. ఇంకో జనసేన నేత, ‘తల్లినీ, షెల్లినీ పక్క రాష్ట్రానికి పంపేశావ్.. బాబాయ్‌ని ఈ లోకంలోనే లేకుండా చేశావ్..’ అంటూ మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.

నిజానికి, జనసేన నేతలు ఏ స్థాయి వ్యాఖ్యలు చేసినా, అవి పెద్దగా లెక్కల్లోకి రావు. జనసేనకు ఈ విషయంలో కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే, ఆ పార్టీ జస్ట్ ‘జీరో’ అనిపించుకుంది గత ఎన్నికల్లో. కానీ, వైసీపీ పరిస్థితి అది కాదు. 2019లో 151 ఎమ్మెల్యే సీట్లు సాధించిన వైసీపీ, ఇప్పుడు ఏకంగా 175 సీట్లను కొల్లగొడతామంటోంది.

ఈ క్రమంలో వైఎస్ జగన్ మాట్లాడే ప్రతి మాటనీ జనం జాగ్రత్తగా విశ్లేషిస్తారు. వైఎస్ జగన్ ఎందుకు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారన్న చర్చ జనంలో గ్రామ స్థాయిలో జరుగుతోంది. అది వైసీపీకి అనుకూలమా.? వ్యతిరేకమా.? అన్న విషయమై భిన్నవాదనలున్నాయి.