అయినను పోయి రావలె హస్తినకు.! ఈ మాట ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో.. అదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తరచూ వినిపించేది. రాష్ట్రం నుంచి సూటుకేసుల్లో డబ్బుని ఢిల్లీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకెళుతున్నారని అప్పట్లో చాలా ఆరోపణలొచ్చాయి. వైఎస్ ‘ఆత్మ’గా చెప్పబడే కేవీపీ రామచంద్రరావు ద్వారా ఈ డబ్బుని తరలించేవారన్నది ఆ ఆరోపణల సారాంశం.
ఈ క్రమంలోనే ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్న డైలాగ్ ప్రాచుర్యం పొందింది. అసలు నిజంగా అలా జరుగుతుందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఉపయోగమేమీ లేదు.. కాంగ్రెస్ హయాంలో, రాష్ట్రానికి మేలు జరగదు.. అన్న భావనలో ఆ డైలాగ్ వాడేవారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. బీజేపీ హయాంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకీ సమ అన్యాయమే జరుగుతోంది తప్ప.. సమ న్యాయం జరగడంలేదు.
తెలంగాణకు ఇవ్వాల్సినవీ ఇవ్వడంలేదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సినవీ కేంద్రం ఇవ్వడంలేదు. చాలా ఇచ్చేశాం.. అని కేంద్రం డబ్బాకొట్టుకోవడం తప్ప, గడచిన ఎనిమిదిన్నరేళ్ళలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వల్ల అదనంగా ఒరిగిందేమీ లేదన్నది నిర్వివాదాంశం. బీజేపీతో వైరం పెట్టుకున్నాక కేసీయార్ ఢిల్లీకి వెళ్ళడం తగ్గింది. చంద్రబాబూ నాలుగేళ్ళు ఢిల్లీకి వెళ్ళి, ఆ తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకుని, యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
ప్రతిసారిలానే జగన్ టూర్కి సంబంధించి ఓ ప్రకటన ప్రభుత్వం నుంచి రావొచ్చు. పాత అంశాలే వుంటాయి అందులో. అవేవీ పరిష్కృతం అయ్యే అంశాలే కావు. అయిననూ పోయి రావలె హస్తినకు.!
