బ్రేకింగ్ న్యూస్: దాడిపై స్పందించిన జగన్

విశాఖ ఎయిర్పోర్టులో జగన్ పై ఎయిర్పోర్టు వెయిటర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయమయ్యింది. కాగా ఈ దాడిపై జగన్ ఫ్యాన్స్, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విషయం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తన ట్విట్టర్ ద్వారా తనపై జరిగిన దాడి గురించి స్పందించారు.

” నా గురించి ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికి నేను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. దేవుడు దయ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు, ప్రేమ నన్ను రక్షిస్తాయి. ఇలాంటి పిరికి చర్యలు నన్ను ఏమి చేయలేవు. ఇటువంటి చర్యలు ప్రజల కోసం పని చేయాలనే నా సంకల్పాన్ని మరింత బలపరుస్తాయి” అంటూ ట్వీట్ చేసారు.

జగన్ పై దాడితో ఆయన అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఇటు వైసీపీ శ్రేణులు సైతం దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రత్యర్ధులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారంటూ ఆగ్రహిస్తున్నారు. కాగా దాడి చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు అతను ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డాడు అని పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.