తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటి చేస్తుందని, పోటి చేయదు టిఆర్ ఎస్ కే జనసేన మద్దతని వస్తున్న వార్తలకు తెరదించుతూ పవన్ మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటి చేయాలనుకున్నామని కానీ ఎన్నికలు తొందరగా వచ్చే సరికి సమయాభావంతో పోటి చేయాలా వద్దా అనే మీమాంసలో పడ్డట్టు పవన్ తెలిపారు. ఏదేమైనా ఎన్నికల్లో పోటి చేసే అంశం పై వారం రోజుల్లో క్లారిటి ఇస్తామన్నారు.
శనివారం ఉదయం బెజవాడలోని బెంజి సర్కిల్ లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలతో జనసేన ఎన్నికల్లో పోటి చేస్తుందనే క్లారిటి వచ్చిందని నేతలంటున్నారు. తమ ఉనికి చాటుకోవడానికైనా ఎన్నికల్లో పోటి చేయాలని తెలంగాణ నేతలు పవన్ ను కోరుతున్నట్టు తెలుస్తోంది.
పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా జనసేన పోటి చేయలేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నకలు ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయడమే మంచి మార్గమని పలువురు పవన్ కు సూచించినట్టుగా నేతలంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయడం ద్వారా ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లవచ్చని ఆ తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో సులువుగా పోటి చేయవచ్చని నేతలంటున్నారు. అందుకే ఎన్నికల్లో పోటి చేయాల్సిందేనని నేతలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారని కీలక నేతల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటి చేసే విషయం పవన్ వద్ద ప్రస్తావించినప్పుడు తెలంగాణ నేతలతో గుడ్ న్యూసే వింటారని పవన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటి చేసి తీరుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
పోటి చేస్తే ఒంటరిగా చేయాలా లేక మహాకూటమితో పొత్తు కుదుర్చుకోవాలా అని చర్చించి పోటి చేసే అవకాశం ఉంది. టిఆర్ ఎస్ కు మద్దతు ఇస్తామని గతంలో పవన్ చెప్పినట్టు వార్తలు రావడంతో టిఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టిఆర్ ఎస్ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్దులను ప్రకటించిన నేపథ్యంలో జనసేన టిఆర్ ఎస్ తో పొత్తు దాదాపు కుదరదనే చెప్పవచ్చు.

అక్టోబర్ 15న రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజి పై జనసైనికుల కవాతు ఉంటుందన్నారు. దాని తర్వాత వైజాగ్, శ్రీకాకుళంలో పర్యటిస్తానని పవన్ తెలిపారు.
