‘ఇదయ్యా తమరి అసలు రూపం’… జగన్ Vs పవన్!

రాజకీయాల్లో హుందాతనం చాలా ముఖ్యమని అంటారు. కిందిస్థాయి నాయకులు స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగానో, వారి అలవాటులో భాగంగానో, వారి పెంపకం ప్రభావంతోనో కాస్త అటు ఇటుగా ప్రవర్తించినా… పార్టీల అధినేతలు, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవారు మాత్రం కచ్చితంగా మిగిలినవారికి ఆదర్శంగా నడుచుకోవాలని, ఈ విషయంలో మరో ఆప్షన్ లేదని చెబుతుంటారు. హుందాతనం ఇక్కడ కీలకమని అంటారు.

అవును… రాజకీయ నాయకుడు అనే వ్యక్తి వస్త్రధారణతో పాటు నడక, నడత, వ్యవహారశైలి, మాట్లాడే భాష, అనుసరించే వైఖరీ, మాటమీద నిలబడే తత్వం, నిలకడతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకుంటారు.

పిల్ల చేష్టలు, వంకర మాటలు ఉండకూడదని.. నలుగురికి ఆదర్శంగా లేకపోయినా పర్లేదు కానీ… నలుగురు అతన్ని చూసి పాడైపోయేలా, తప్పుడు మార్గాల్లో ప్రయాణించేవారిలా మాత్రం ఉండకూడదని ఆశిస్తారు!

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… రాజకీయాలకు అతీతంగా.. పవన్ కల్యాణ్ విషయంలో జగన్ అనుసరిస్తోన్న వైఖరి, జగన్ విషయంలో పవన్ ఎంచుకున్న వ్యవహారశైలిపై తాజాగా ఆసక్తికర చర్చ మొదలైంది. అందుకు కారణం… ఇటీవల పవన్ వ్యక్తిగత జీవితం విషయంలో జగన్ చేసిన ట్వీట్లు, జగన్ విషయంలో పవన్ చేసిన పలు వ్యాఖ్యలు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్.. సింగపూర్‌ లోని తన స్కూల్‌ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రివర్ వ్యాలీ రోడ్‌ లోని స్కూల్‌ లో జరిగిన ఈ ప్రమాదంలో… అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.. పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ ఇబ్బంది కూడా కలిగింది. దీనిపై జగన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

ఇందులో భాగంగా… సింగపూర్‌ లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి తాను షాక్ అయ్యానని.. అందులో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసిందని.. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయని.. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానని జగన్ రియాక్ట్ అయ్యారు.

ఇక… తాజాగా పవన్ కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులతో చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. వ్యక్తిగత వైద్యుల సలహాతో హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి వెళ్లి వివిధ పరీక్షలు చేయించుకోగా… ఏప్రిల్ 18న శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగానూ వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇందులో భాగంగా… పవన్ కల్యాణ్ గారు శస్త్రచికిత్స తర్వాత త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాము అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇది పవన్ కల్యాణ్ విషయంలో జగన్ అనుసరించిన వైఖరి!

కట్ చేస్తే… గతంలో జగన్ కు ఇలాంటి సమస్యలే ఎదురైనప్పుడు పవన్ కల్యాణ్ రియాక్షన్ ఏవిధంగా ఉంది అనేది ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఉదాహరణకు.. విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి.. పందేలా సమయంలో కోడి కాళ్లకు కట్టే కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీన్ని… “జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి కేసు” అని అనకుండా, “కోడి కత్తి కేసు” అంటూ ఓ వర్గం మీడియా తనదైన సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శించిన పరిస్థితి!

దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కోడికత్తి దాడిపై సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు సైలెంట్ అయిపోయారు.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి వారం ముందే కోడికత్తి దాడి కేసులో నిందితుడికి బెయిల్ వచ్చింది.. అందుకే కోడికత్తి కేసుపై స్పష్టమైన విచారణ జరపాలి అంటూ స్పందించారు. దీంతో.. పవన్ వ్యాఖ్యల్లో ఉన్న నిగూడార్ధం గ్రహించలేనంత కష్టం కాదనే చర్చ జరిగింది.

ఇక… 2024 ఎన్నికల ప్రచార సమయంలో జగన్ పై మరోసారి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి పూట ప్రచారం చేస్తోన్న సమయంలో.. జగన్ నుదిటిపై గాయమైంది. దీంతో… కాస్త ఉంటే కన్నే పోయేది అనే ఆందోళన వ్యక్తమైంది. దీనిపైనా పవన్ కల్యాణ్ స్పందించారు.

ఇందులో భాగంగా… జగన్ కు దెబ్బ తగిలిందని తనకు చెప్పారని.. అందుకు నేనేమి చెయ్యాలని ఎదురు ప్రశ్నిస్తే.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ప్రకటన ఇవ్వాలని చెబితే.. “ఏమో అది నిజమో అబద్ధమో నాకు ఏమి తెలుసు.. అతనే తన తలను కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు.. తెలియదు కదా” అని వ్యాఖ్యానించారు.

ఇలా.. విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జగన్ కావాలనే చేయించుకున్నారన్న భావన కల్పించేలా టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం.. ఓ వర్గం మీడియా సంస్థలు కథనాలు రాయడం, హెడ్డింగులు పెట్టడం.. ఆ రెండింటికీ తంథానతాన అన్నట్లుగా పవన్ కల్యాణ్ కూడా ఆ దాడిపై సందేహాలు వ్యక్తపరుస్తున్నట్లు వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

దీనిపై అప్పట్లో వైసీపీ నుంచి ఘాటుగానే రియాక్షన్ వచ్చింది. ఆ దాడిపై సందేహం ఏమైనా ఉంటే.. ఆ కేసును విచారిస్తుంది ఎన్.ఐ.ఏ. కాబట్టి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కల్యాణ్ కు ధైర్యం ఉంటే ప్రశ్నించొచ్చని సూచించారు వైసీపీ నేతలు.

ఇదే సమయంలో… అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు జరిపినట్లు చెబుతోన్న దాడి ఎంత నిజమో… విశాఖ విమానాశ్రయంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ జగన్ పై జరిగిన దాడి అంతే నిజమని.. నాడు రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు అలిపిరిలో ఆ తరహా డ్రామాకు తెరలేపితే తాము చెప్పేది ఏమీ లేదని స్పందించిన పరిస్థితి.

ఈ నేపథ్యంలోనే… ముందుగా పవన్ విషయంలో జగన్ ఇచ్చిన రియాక్షన్… జగన్ కు వ్యక్తిగతంగా ఇబ్బంది వచ్చినప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి వ్యక్తిత్వాలనూ పోలుస్తూ తమదైన శైలిలో పోస్టులు పెడుతూ.. కామెంట్ సెక్షన్ లో తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఈ పోస్టులకు “ఇదయ్యా తమరి అసలు రూపం” అనే కామెంట్స్ వైరల్ గా మారాయి!