వర్మ, దొరబాబుకు చెలగాటం.. పవన్ కు ప్రాణసంకటం..!

“తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు” అనేది తెలుగులో చాలా ప్రసిద్ధమైన సామెత. అంటే… మానవుడు తన జీవితంలో ఒక రకమైన ప్లాన్స్ వేసుకుంటే, దైవం లేదా విధి వేరే రకమైన ఫలితాలను ఇస్తుందని అర్ధం.

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే… “నాకు అవమానం జరిగినా పర్లేదు కానీ చంద్రబాబుకు జరిగితే మాత్రం ఊరుకోను.. తనను లైట్ తీసుకున్నా పర్లేదు కానీ, చంద్రబాబు విషయలో దాన్ని తట్టుకోలేను” అన్నట్లుగా పిఠాపురంలో వర్మ నడుచుకుంటున్న వేళ… చంద్రబాబు నుంచే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో.. పవన్ పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చ మొదలైంది.

అవును… పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి, ఆయన గెలుపు వరకూ అన్నీ తానై అన్నట్లుగా చూసుకుని, మడత రాజకీయాలేమీ చేయకుండా సపోర్ట్ చేస్తే.. ఈ రోజు తనను కరివేపాకులా తీసేస్తున్నారని వర్మ లోలోపల బాధపడుతున్నారా లేదా అనే సంగతి తెలియదు కానీ… స్వయంగా సీఎం చంద్రబాబు ఫోటోలను ఫ్లెక్సీల్లో మాయం చేస్తుండటంపై మాత్రం తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఆయన్ని కొట్టడానికి జనసేన నేతలు పోటీ పడి వస్తున్నారు!

ఈ సమయంలో.. సాధారణంగా తనకు టీడీపీ అధిష్టాణం నుంచి మద్దతు ఉంటుందని ఏ నాయకుడైనా అనుకుంటారు, ఏ కార్యకర్త అయినా భావిస్తారు, ఆశిస్తారు. కానీ… పైన చెప్పుకున్న సామెత ప్రకారం.. వర్మ, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఒకటి తలిస్తే.. చంద్రబాబు మాత్రం మరొకటి తలిచారు. వర్మపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని.. టీడీపీ నేతలు ప్రొటోకాల్ పేరుతో, ఫ్లెక్సీల్లో ఫొటోల ప్రాధాన్యం కోసం ఘర్షణ పడటం సరికాదని అన్నారని కథనాలొచ్చాయి.

అంతేకాదు సుమా… తాజా ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వర్మ తీరుపై తీవ్ర అసంతృప్తి ప్రదర్శిస్తూ… ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఫాలో అప్ చేయాల్సిందిగా ఆదేశించారని అంటున్నారు. దీంతో… “అట్టుంటాది బాబుతోనీ” అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోండగా… ఈ సమయంలో వర్మ అడ్డం తిరిగితే పిఠాపురంలో పవన్ పొలిటికల్ కెరీర్ ఏమిటనే చర్చా మొదలైంది.

సరిగ్గా గమనిస్తే.. పిఠాపురంలో వర్మ, ఆయన అనుచరులు, స్థానిక టీడీపీ కేడర్ అసంతృప్తికి మూడు ప్రధాన కారణాలు ఉండగా, మరొకటి మాత్రం పుండుపై కారం చల్లినట్లుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… భీమవరం, గాజువాక అనుభవం తర్వాత పిఠాపురంలో పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో… టీడీపీ వర్మ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందనే చెప్పాలి. ఈ విషయంలో వర్మ ఎలాంటి తెరవెనుక రాజకీయాలూ చేయలేదనే చెప్పుకోవాలి!

ఎందుకంటే… 2019లో భీమవరంలో 8వేలకు పైగా, గాజువాకలో 16వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలైన పవన్ కల్యాణ్ కు.. 2024లో పిఠాపురంలో మాత్రం 70వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో భారీ విక్టరీ లభించింది. ఇందులో వర్మ పాత్రను ఎవరూ కొట్టివేయలేరు.

ఇక్కడ 2014లో టీడీపీ, వైసీపీ పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిన వర్మ 47వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాంటి వర్మ.. 2024లో తెరవెనుక రాజకీయం చేసి ఉంటే.. పవన్ కు మరో పరాభవం తప్పకపోయి ఉండేదని అనుకొన్నా అతిశయోక్తి కాదు!

కట్ చేస్తే… పవన్ కల్యాణ్ గెలుపొందడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయింది. మరోవైపు పిఠాపురం పాలనలో రోజు రోజుకీ వర్మ ప్రాధాన్యత తగ్గిస్తున్నారని.. కూటమి అనే ఆలోచన పక్కనపెట్టి, జనసేన నేతలు అన్నీ వారై నడిపిస్తున్నారని, వర్మతో పాటు స్థానిక టీడీపీ శ్రేణులను ఆటలో అరటిపండులా చూస్తున్నారని అంటున్నారు. ఇది వర్మ ఆగ్రహానికి, అసంతృప్తికి మొదటి కారణం అని తెలుస్తోంది.

మరోవైపు… 2014, 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో ఉండి.. 2014లో తన చేతుల్లో ఓడి, 2019లో తనను ఓడించిన మాజీ వైసీపీ నేత పెండెం దొరబాబు పిఠాపురంలో చేస్తోన్న పెత్తనం కూడా ఆయన అసంతృప్తికి, ఆగ్రహానికి రెండో కారణం అని చెబుతున్నారు. ఇది పచ్చి పుండుని కాకివచ్చి పొడుస్తున్నంత బాధను ఆయనకు, ఆయన అనుచరులకు కలిగిస్తోందని అంటున్నారు.

అదే విధంగా… ఎన్నికల ప్రచార సమయంలో వర్మను ఉద్దేశించి చంద్రబాబు చెప్పిన మాటలు, చేసిన వాగ్ధానాలు నీటిమీద రాతలవ్వడంపైనా వర్మ & కో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆశించారని.. అయితే, ఎన్నికలయిపోయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. “పక్కకెళ్లి ఆడుకోమ్మా” అన్నట్లుగా తనను తీసిపారేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూడు కారణాలూ ఒకెత్తు అయితే… వీటికి మించి మరొకటి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా… ఎన్నికల సమయంలో ప్రజలందరి ముందు తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని పక్కనపెట్టడం ఒకెత్తు అయితే, నాగబాబును ఎమ్మెల్సీ చేయడం ఒకెత్తు అని.. దానికితోడు పిఠాపురం నియోజకవర్గానికి ఆయన అనధికారిక ఎమ్మెల్యేగా నడుచుకుంటుండటం పుండు మీద కారం చల్లినట్లుగా మారిపోయిందని చెబుతున్నారు.

అయినప్పటికీ అన్నీ తట్టుకుని భరిస్తున్న సమయంలో… సాక్షాత్తు చంద్రబాబు ఫోటోని ఫ్లెక్సీల్లో లేకుండా చేయడంతో.. మరింత మంటేక్కిపోయారని అంటున్నారు. కానీ విధి విచిత్రమైనది కావడంతో… వర్మకు చంద్రబాబు నుంచే బిగ్ షాక్ తగిలిన పరిస్థితి.

ఈ నేపథ్యలోనే మరో కీలక చర్చ తెరపైకి వస్తోంది. ఇందులో భాగంగా… వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓ సారి ఓడిన, మరోసారి గెలిచిన, తన రాజకీయ ప్రత్యర్థి అయిన పెండెం దొరబాబుపై వర్మ విరుచుకుపడటం వల్ల.. దొరబాబుకు వచ్చిన నష్టం ఏమీ లేదనేది పలువురి అభిప్రాయంగా ఉంది.

ఇదే సమయంలో… పిఠాపురంలో టీడీపీ, జనసేనను కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వర్మపై పెండెం దొరబాబు ఫైర్ అవ్వడం వల్ల.. వర్మకు కొత్తగా వచ్చే సమస్య ఏమీ లేదనేది మరికొంతమంది అభిప్రాయంగా ఉంది.

కానీ… వీరిద్దరూ ఉప్పూ నిప్పుగా ఉండటం వల్ల పిఠాపురం నియోజకవర్గం నుంచి 2029లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పవన్ కల్యాణ్ కు మాత్రం కచ్చితంగా సమస్యే అని అంటున్నారు. ఎందుకంటే… దొరబాబు జనసేనలోనే ఉన్నారు కాబట్టి.. జనసేన ఓట్లు, ఆయన అనుచరుల ఓట్లు పవన్ కి పడతాయి.

కానీ.. ఇండిపెండెంట్ గా గెలిచి, తనకు పిఠాపురంలో ఉన్న బలాన్ని చేతాల్లో చూపించి.. పైగా, 2024లో సీటు త్యాగంతోనూ, తదనంతర తాజా పరిణామాలతోనూ సానుభూతి సైతం సంపాదించుకున్న వర్మ అడ్డం తిరిగితే.. పవన్ పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

సో… తాజా రచ్చ అటు వర్మకు, ఇటు దొరబాబుకు చెలగాటమేనేమో కానీ.. పవన్ పొలిటికల్ కెరీర్ కు ప్రాణసంకటంగా మారే ప్రమాదం పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చన్నమాట!