మొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వద్దకు వెళ్ళారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే కొత్తగా ఏం జరుగుతుంది.? ఇలా ఆలోచించాలి మామూలుగా అయితే అధికార వైసీపీ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘వై నాట్ 175’ అంటున్నారు. 85 శాతం ఇళ్ళకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చామంటున్నారు. సో, 85 శాతం ఓట్లు వైసీపీ ఖాతాలో వున్నట్లే లెక్క. ‘లబ్దిదారులందరికీ అర్థమయ్యేలా చెప్పండి.. వైసీపీని గెలిపించేలా వారికి అవగాహన కల్పించండి’ అంటూ గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమాన్నీ వైఎస్ జగన్ అమలు చేస్తూ, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
అలా గడప గడపకూ వెళ్ళేందుకు వైసీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపడంలేదుగానీ, ‘చంద్రబాబు – పవన్ కళ్యాణ్’ మీద మాత్రం చాలా చాలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. గడచిన మూడున్నరేళ్ళలో టీడీపీ చాలా చాలా నిర్వీర్యమైపోయింది. జనసేన పార్టీ ఎదుగూ బొదుగూ లేకుండా వుంది.
ఈ పరిస్థితుల్లో వైసీపీ చేయాల్సిందేంటి.? ఆ రెండు పార్టీల్నీ ఇగ్నోర్ చేయడం. కానీ, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అనగానే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. అందరూ మీడియా ముందుకొచ్చేశారు. సామాజిక మాధ్యమాల సాక్షిగా స్పందించేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం, వైసీపీ అనుకూల మీడియా.. అంతా కలిసి.. అనూహ్యమైన రీతిలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీకి స్పెషల్ కవరేజ్ ఇవ్వడం చూశాం. వైసీపీ ఓటమి సంకేతాల్ని వైసీపీనే ఇచ్చుకుంటోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
