చంద్రబాబుతో భేటీ.! సెల్ఫ్ గోల్ చేసుకున్న పవన్ కళ్యాణ్.!

అయిపాయె.! కాపు సామాజిక వర్గం ఇకపై పూర్తిగా పవన్ కళ్యాణ్‌ని పక్కన పడేసినట్టేనేమో.! చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవడం వల్ల కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అమ్మేస్తారనడం సబబు కాదు. ఏ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా ఒక్కరి వెంట నడవదు.

టీడీపీలోనూ రెడ్డి సామాజిక వర్గ నేతలున్నారు. కాపు సామాజిక వర్గ నేతలున్నారు.. కమ్మ సామాజిక వర్గ నేతలతోపాటు. వైసీపీలో అయినా అంతే. జనసేనలో కూడా అంతే. ఈ మూడు కులాలే కాదు కదా, రాష్ట్రంలో చాలా కులాలున్నాయి.

సరే, వైఎస్ జగన్ పట్ల రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మందికి సానుకూలత, కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు పట్ల ఎక్కువ సానుకూలత, పవన్ కళ్యాణ్ పట్ల కాపు సామాజిక వర్గంలో ఎక్కువ సానుకూలత.. వుంటే వుండొచ్చు. ఎక్కువ వేరు.. మొత్తంగా.. అనేది వేరు.

అయితే, చంద్రబాబు దగ్గరకు వెళ్ళి ఆయన్ని పరామర్శించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్‌కి ఏమొచ్చింది. చంద్రబాబు ఏమీ నిర్బంధానికి గురవలేదు.. గతంలో పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్బంధానికి గురైనట్లు. పైగా, చంద్రబాబు సభల వల్ల తొక్కిసలాట జరిగి 11 మందికి పైగా చనిపోయారు ఈ మధ్యకాలంలో.

ఆ బాధిత కుటుంబాల్ని విపక్ష నేత హోదాలో పవన్ కళ్యాణ్ పరామర్శించి వుంటే, ఇప్పుడీ చంద్రబాబుతో భేటీ విషయమై ఇంతలా విమర్శలొచ్చేవి కావేమో.! ‘నేనే ముఖ్యమంత్రినవుతా..’ అనడం వల్ల ‘కాపు ముఖ్యమంత్రి’ కోణంలో పవన్ వెంట కాపు సామాజిక వర్గంలో మెజార్టీ నడిచేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇంతలోనే చంద్రబాబుతో పవన్ భేటీ.. తప్పుడు సంకేతాల్ని పంపింది. పవన్ తనకు తానే చేటు చేసుకుంటున్నారు.. చంద్రబాబు వెంట నడవడం ద్వారా.