ఈ రోజు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చెన్నై పర్యటనకు వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అనేక అసక్తి కరమయిన విషయాలు చెబుతూ వైసిపి తో పొత్తుకు జనసేన ప్రయత్నిస్తున్న వాదనను ఖండించారు. అది టిడిపి ప్రచారం అన్నారు. మొదట తమిళంలో పలకరించి ఆయన ఉపన్యాసం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలిచిన చోటల్లా అవినీతే నని, దాదాపు వేయి కోట్ల అవినీతి జరిగి ఉంటుందని పవన్ కల్యాణ్ ఆరోపించార. 2014 ఎన్నికల్లో తానేందుకు పోటీ చేయలేదో ఆయన వివరించారు.చంద్రబాబు మీద తీవ్రంగా విమర్శలు చేశారు. చురకలు జోక్స్ వేశారు.
ఆయన మాటల్లోనే …
చంద్రబాబు గారు చాలా గొప్పమనిషి, మీరు అలా నవ్వకండి, ఆయనకి ఈరోజు స్నేహితుడిగా ఉన్నవాడు రేపు బద్ధ శత్రువు అవుతాడు, ఆయనను ఎవరు నమ్మకూడదు
‘‘చంద్రబాబు గారు చెప్పే మహా కూటమి తో ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే భవిష్యత్తులో ఆయన వారిని చాలా దారుణంగా మోసం చేస్తాడు, చంద్రబాబు గారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి.చంద్రబాబు లాంటి ప్రమాదకరమైన వ్యక్తితో పొత్తు చాలా ప్రమాదకరం, అందుకే మూడో ప్రత్యామ్నాయం దిశగా జనసేన పనిచేస్తుంది. రాష్ట్ర విభజన తీరు వలన ప్రజల కోసం పార్టీ పెట్టినప్పటి, అప్పటి రాజకీయ పరిస్థితుల వలన అనుభవజ్ఞుడు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని టీడీపీ కి మద్దతు ఇచ్చే, పోటీకి దిగలేదు.
టీడీపీ, బీజేపీ కూటమి మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వారికి మద్దతు ఇచ్చే, వారికి ప్రచారం చేసాను, కానీ టీడీపీ ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయింది, వారు గెలిచిన దాదాపు అన్ని స్థానాల్లో వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగింది.చంద్రబాబు గారు పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు, ఆయన పంచాయితీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని కుమారుడు లోకేష్ ని పంచాయితీ శాఖ మంత్రిని చేశారు.’’
ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ లో జరుగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ అక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని అన్నారు.
‘‘2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బలమైన త్రిముఖ పోటీ ఉండబోతుంది, బీజేపీ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వారి పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది. వైస్సార్సీపీ లాంటి పార్టీతో జనసేన ఎందుకు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తుంది, వారి అవినీతి, చేతకానితనం గురించి రోజు విమర్శిస్తుంటే వారితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాం అనటం టీడీపీ వారి అసత్య ప్రచారాలు, వాటిని నేను పట్టించుకోను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేన పార్టీ చేతిలో ఉంది, జనసేన మాత్రమే రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించగలదు, అందుకే ఇంతమంది ప్రజలు, నాయకులు జనసేనకు అండగా ఉన్నారు.’’
ఇంకా ఏమన్నారంటే…
‘‘ 10 సంవత్సరాల క్రితం ఆంధ్రా ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేవారు.తెలుగు ప్రజలు అయినప్పటికీ అక్కడ ప్రజల మధ్య విద్వేషాలు నెలకొన్నాయి, దీనికి కారణం ప్రజలు కాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు.ఒక క్రమ పద్ధతి లేకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన విభజన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కోల్పోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు ప్రజారాజ్యం నుంచి రాజకీయ పోరాటం చేశాను, అప్పుడు 18 సీట్లు విజయం సాధించాం, మొత్తంగా చూసుకుంటే దాదాపు 23 శాతం ఓట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి.’’
# 2019 ఎన్నికలు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉంటాయి, ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఉంటాయి
#దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక త్రాటి మీదకు రావలసిన అవసరం ఉంది, ఉత్తర,బీహార్ రాష్ట్రాలు దేశ రాజకీయాలను శాసించే విధానాన్ని మార్చాలి, మనం చిన్న పార్టీలు కావచ్చు కానీ మనమంతా కలిసి నిలబడాల్సిన అవసరం ఉంది
#అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా జనసేన పార్టీ నుంచి దక్షిణ భారతదేశం నుంచి రెండవ రాజధాని ప్రకటన జరగాలి అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాము.ఉత్తరప్రదేశ్ ఒక్కటే దేశ రాజకీయల్ని శాసిస్తుంటే దక్షిణ భారతానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడేది ఎవరు, అందుకే రెండవ రాజధాని అవసరం
