Pawan Kalyan: మక్కీలు విరగగొట్టే ముహూర్తం ఎప్పుడు పవన్..?

రాజకీయాల్లో పేరు ప్రతిష్టలు, పదవులు రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన వాటిని ఒళ్లు దగ్గరపెట్టుకుని కాపాడుకోవడం అంతే ముఖ్యమని అంటారు. రాజకీయ నాయకులు కేవలం తెల్ల షర్టులు వేసుకుని తిరగడమే కాదని.. వారి క్యారెక్టర్ కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండేలా ప్రవర్తించాలని చెబుతారు. అయితే గత కొంతకాలంగా ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన నేతలపై వినిపిస్తోన్న ఆరోపణలు, వెలుగులోకి వస్తోన్న వీడియోల వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఘటనతో… “వారందరి మక్కీలు విరగగొట్టే ముహూర్తం ఎప్పుడు పవన్” అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు, ఏపీ ప్రజలు!

రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రిగితే.. ఆ పనికి పూనుకున్నవారి కాళ్లు , చేతులు, మ‌క్కీలు విర‌గ్గొడ‌తాన‌ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చ‌రిస్తుంటున్న సంగతి తెలిసిందే. నాడు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా మహిళల రక్షణ విషయంలో ఆయన తన స్టాండ్ ని బలంగా, బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీ నాయకులపై వస్తోన్న ఆరోపణలపై మాత్రం జనసేనని నుంచి చర్యలు కనిపించడం లేదని.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే సూత్రాన్ని పాటిస్తున్నట్లుగా కనిపిస్తుందని.. నాలుగు రోజులు ఆగితే అందరూ అన్నీ మరిచిపోతారులే అన్నట్లుగా ముందుకు పోతున్నట్లు అనిపిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు జనసేనలోని పలువురు నేతల రాసలీల బాగోతాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. పైగా ఇవన్నీ ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా వెలుగులోకి రావడంతో.. బొంకలేని పరిస్థితి అని అంటున్నారు. ఉదాహరణకు…  మొద‌ట తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన ఇన్‌ చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ బాగోతాలు బ‌య‌ట‌ప‌డిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పార్టీ… నిజానిజాలు నిగ్గు తేలే వ‌ర‌కు, పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా వుండాల‌ని ఆదేశించింది. అయితే… ఆ త‌ర్వాత విచార‌ణ ఏమైందో తెలియ‌దు కానీ.. ఆయన మ‌ళ్లీ జ‌న‌సేన నాయ‌కుడిగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు!

ఇక ఆ త‌ర్వాత రైల్వేకోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ వ్యవహారం ఎంత తీవ్రంగా మారిందనేది తెలిసిన విషయమే. ప్రజాస్వామ్య దేవాలయంలో మహిళతో వీడియో కాల్ మాట్లాడారనే విషయమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా… అర‌వ శ్రీ‌ధ‌ర్ తనను వేధించిన వైనంపై బాధిత మహిళ వ‌రుస‌గా వీడియోలు విడుద‌ల చేస్తూ వ‌చ్చారు. దీనికి తోడు జ‌న‌సేన నాయ‌కుడు తాతంశెట్టి నాగేంద‌ర్ భౌతికంగా సదరు బాధిత మహిళపై దాడికి పాల్ప‌డ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇంత బరి తెగింపు ఎలా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

అయితే… కొన్ని రోజులు సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన శ్రీధర్… ఇటీవల జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపించారు. ప్రశ్నించిన మీడియాకు సమాధానాలు చెప్పలేకున్నారు! ఇలా వరుసగా జనసేన నేతలకు సంబంధించిన ఈ తరహా వ్యవహారాలు తీవ్ర కలకలం రేపుతోన్న నేపథ్యంలో… తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వీర‌వాసరం జెడ్పీటీసీ గుండా జ‌య‌ప్ర‌కాశ్‌ నాయుడి పై రాస‌లీల‌ల ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా… మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు… జ‌న‌సేన జెడ్పీటీసీ స‌భ్యుడు త‌న‌ను మోసగించాడని.. తనను సుమారు ఏడాదిగా శారీరకంగా వాడుకుని రూ.10 లక్షల నగదు, బంగారం తీసుకుని మోసిగించిన‌ట్టు ఆమె తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ వ్యవహారం కూడా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో… ఇలా విచ్చలవిడిగా తెగించి తిరుగుతున్న పలువురు జనసేన నాయకుల విషయం పవన్ కల్యాణ్ చర్యలకు ఉపక్రమించాలని.. మిగిలిన వారికి బుద్ధి వచ్చేలా చర్యల తీవ్రత ఉండాలని.. మహిళలకు హామీ ఇచ్చినట్లుగానే, వారిని మోసగించిన జనసేన నాయకుల మక్కీలు విరగగొట్టే ముహూర్తం పవన్ త్వరలో పెట్టాలని… తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషినని నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.