Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వైద్యులు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ విషయంపై స్పందిస్తూ చిరంజీవి తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు. “కల్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.” అని అన్నారు.

పవన్ కల్యాణ్ తిరిగి తన సాధారణ రాజకీయ మరియు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి సుమారు వారం రోజుల సమయం పట్టవచ్చని వైద్యులు సూచించినట్లు చిరంజీవి తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడానికి ఈ విశ్రాంతి అవసరమని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కోట్లాది మంది అభిమానులకు, శ్రేయోభిలాషులకు చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనకు సంపూర్ణ శక్తి, సాంత్వన చేకూరాలని మనమందరం ఆకాంక్షిద్దామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.

