సాధారణంగా ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు దక్కనివారిని బుజ్జగిచ్చేందుకు ఆయా పార్టీల అధినేతలు వారికి ఎమ్మెల్సీ లేదా మరో నామినేటెడ్ పోస్టులను ఆశ చూపిస్తారు. ఎంపీలుగా టిక్కెట్లు ఇవ్వలేనివారికి రాజ్యసభ హామీ ఇస్తుంటారు.
ఉదాహరణకు గత ఎన్నికల సమయంలో పిఠాపురంలో టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్ వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ, వీలైతే మంత్రివర్గంలోకి చోటు అన్నట్లుగా అన్నమాట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు, ఒట్టు తీసి గట్టుమీద పెట్టడాలు వంటివి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.
ఇప్పుడు ఈ ఉపోధ్ఘాతమంతా ఎందుకంటే… వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ నాలుగూ కూటమికే దక్కనున్న నేపథ్యంలో.. టీడీపీకి ఎన్ని, ఎవరెవరు.. జనసేనకు ఎన్ని, ఎవరెవరు.. బీజేపీకి ఎన్ని ఎవరెవరు అనే చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఈ సందర్భంగా విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం… పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేరు ఉండటం గమనార్హం.
తాజా పరిణామాల నేపథ్యంలో ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లోనూ రెండు టీడీపీకి.. జనసేన, బీజేపీలకు చెరొక స్గ్థానం దక్కనున్నాయని అంటున్నారు. అయితే ఇప్పటికే బీజేపీకి రెండు సార్లు అవకాశం వచ్చినందున తమకు ఈ సారి మూడు స్థానాలు ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సరే సీట్ల పంపకాలు 2 + 1 + 1 గా ఉంటాయా.. లేక, 3 + 1 + 0 గానే సెట్ అవుతాయా అనే సంగతి అలా ఉంచితే… తెరపైకి వస్తోన్న పేర్లు మాత్రం ఆసక్తిగా మారాయి.
అందుతోన్న సమాచారం ప్రకారం… ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తో పాటు ప్రధానంగా భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎళ్లా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్ పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే… సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్ ఎన్నికై కేవలం ఏడాదిన్నర మాత్రమే కావడంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో ఇంక టీడీపీకి ఉన్న రెండో స్థానానికి… కృష్ణా ఎల్లా, గల్లా జయదేవ్ మధ్య టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. ఎందుకంటే వీరిద్దరూ ఎవరి లెక్కలో వారు టీడీపీ అటు ఆర్థిక సహకారంగానూ, ఇటు మీడియా పరంగానూ కావాల్సిన వారని చెబుతున్నారు.
ఇక మూడో స్థానం కూడా టీడీపీకి దక్కితే.. కచ్చితంగా కిలారు రాజేష్ కి ఛాన్స్ పక్కా అనేది చినబాబు వర్గం నుంచి వినిపిస్తోన్న మాట. ఇక.. మరీ అద్భుతం జరిగితే తప్ప భాష్యం స్కూల్స్ అధినేత రామకృష్ణకు అవకాశం దక్కకపోవచ్చని అంటున్నారు. ఇక బీజేపీ కచ్చితంగా తమకు ఒక స్థానం కావాలని పట్టుబడితే.. అది తమిళనాడు మాజీ పోలీస్ అధికారి అన్నామలై ను వరించనుందని చెబుతున్నారు.
ఇదంతా ఒకెత్తు అయితే… కచ్చితంగా ఒక రాజ్యసభ సీటు జనసేనకు దక్కుతుంది కాబట్టి.. ఆ స్థానంలో నిన్నమొన్నటి వరకూ లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపించింది. పైగా.. అటు చంద్రబాబు, ఇటు పవన్ తో రమేష్ కి మాంచి సాన్నిహిత్యం ఉండటంతో.. ఇక ఈయనకు అడ్డు ఉండకపోవచ్చని అంతా భావించారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.. అదే అల్లు అరవింద్.
ఇప్పటికే తనకు రాజకీయాల్లో అన్ని విధాలా సహకరించిన తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేసిన పవన్ కల్యాణ్… తనకు తండ్రి సమానుడైన తన పెద్ద అన్న చిరంజీవికి బావమరిది.. తనకు తల్లి సమానురాలైన వదిన సురేఖకు అన్న అయిన అల్లు అరవింద్ ను జనసేన తరుపున రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారని అంటున్నారు.
ఈ విషయంలో చిరంజీవి నుంచి సలహా వంటిది అందిందని చెబుతున్నారు. తద్వారా కొణిదెల వర్సెస్ అల్లు అనే ప్రచారానికి తెర పడినట్లవుతుందని చెప్పినట్లు సమాచారం! సో… ఈ సమాచారాలు, ప్రచారాలు అన్నీ నిజమైతే… ఇకపై “నిర్మాత అల్లు అరవింద్ – రాజ్యసభ ఎంపీ” అనే టైటిల్ కార్డు చూడొచ్చన్నమాట!
