పెద్దలు జానారెడ్డికి హైకమాండ్ ఝలక్

టిఆర్ఎస్ నేతలు సైతం పెద్దలు అని పిలిచే జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాకిచ్చింది. మిర్యాలగూడ సీటును తన కుమారుడికి ఇప్పించుకోవాలనుకున్న జానారెడ్డి ఎత్తులను హైకమాండ్ చిత్తు చేసింది. జానారెడ్డి తన కుమారుడికి  టికెట్ దక్కక పోతే  తన వియ్యంకుడి తమ్ముడికి సీటు ఇప్పించుకోవాలని కోదండరాంతో సైతం చర్చలు జరిపారు. అతనిని టిజెఎస్ లో చేర్చుకొని అక్కడి  నుంచి పోటి చేయించాలని కోరారు. కానీ టిజెఎస్ దీనిని పట్టించుకోకుండా అక్కడ తమ అభ్యర్ధిగా విద్యాధర్ రెడ్డిని ప్రకటించింది. అయితే మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్ధిగా సుధీర్ఘకాలం బిసి లీడర్ గా పని చేసిన ఆర్. కృష్ణయ్యను బరిలోకి దింపింది.

తెలంగాణ కాంగ్రెస్ 6 స్థానాల అభ్యర్దులను ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా బిసి ఉద్యమ నేత, టిడిపి తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు అసెంబ్లీ సీటు వరించింది. మిర్యాలగూడ స్థానం నుంచి ఆర్.కృష్ణయ్యకు టికెట్ కేటాయించారు. పార్టీలో చేరకముందే కృష్ణయ్యకు టికెట్ కేటాయించారని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ కృష్ణయ్య ఆదివారం  సాయంత్రం హైదరాబాద్ లో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన వెంటనే మిర్యాలగూడ టికెట్ కేటాయిస్తు ప్రకటించారు.  కృష్ణయ్య స్వంత జిల్లా అయినా వికారాబాద్ లోని తాండూరు నుంచి ఆయనకు సీటు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయనను మిర్యాలగూడ నుంచి ప్రకటించారు. 

వాస్తవానికి కృష్ణయ్య 20 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అప్పుడే వీరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా చివరి నిమిషం వరకు కూడా ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కృష్ణయ్య ఎల్ బీ నగర్ సీటు కోరినప్పటికి అక్కడ సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించే అవకాశాలు ఉండటంతో రాహుల్ కృష్ణయ్యకు సర్ధి చెప్పారని తెలుస్తోంది. ఉత్తమ్ కూడా రాహుల్ తో చెప్పి కృష్ణయ్యకు కాంగ్రెస్ టికెట్ వచ్చేలా చేశారని తెలుస్తోంది. మొత్తానికి కృష్ణయ్యకు ఆఖరి నిమిషంలో సీటు కేటాయించి అందరిని కాంగ్రెస్ పార్టీ షాక్ కు గురి చేసింది.    

తాజాగా ప్రకటించిన ఆరు స్థానాల్లో 3 స్థానాలను బిసిలకు కేటాయించారు. సీట్ల కేటాయింపులో బిసి సామాజిక వర్గాల వారికి అన్యాయం జరిగిందంటూ బిసి సంఘాలు, నేతలు నిరసన వ్యక్తం చేశారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని 3 సీట్లు బిసిలకు కేటాయించారని తెలుస్తోంది. మరో ముఖ్య నేత కాసాని జ్ఞానేశ్వర్ కు కూడా సికింద్రాబాద్ స్థానం నుంచి టికెట్ కేటాయించారు. కాసాని స్థానం పై కూడా తర్జన భర్జనలు జరిగాయి. కానీ బిసిల నిరసనలతోనే కాసానికి సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. 

 

టిజెఎస్ కింకర్తవ్యం

మిర్యాలగూడ స్థానం నుంచి విద్యాధర్ రెడ్డికి ఇప్పటికే టిజెఎస్ బీఫారం అందజేసింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా కృష్ణయ్యను ప్రకటించారు.కూటమిలో కలిసి ఉన్న పార్టీలు ఎవరికి వారు అభ్యర్దులను ప్రకటించడంతో సంకట పరిస్థితి ఏర్పడింది.   మిర్యాలగూడతో పాటు మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ పోటి చేస్తుంది. మహబూబ్ నగర్ లో ఇప్పటికే టిడిపి ఎర్రశేఖర్ ను ప్రకటించింది. అక్కడ టిజెఎస్ కూడా రాజేందర్ రెడ్డిని ప్రకటించింది.

 

ఈ రెండు సీట్లలో టిజెఎస్ కూడా తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ బిసి అభ్యర్ధులను ప్రకటించగా టిజెఎస్ మాత్రం రెడ్డి సామాజిక వర్గాల వారిని బరిలో దింపింది. ప్రస్తుత పరిస్థితిలో టిజెఎస్ ఉపసంహరించుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే జనగామ వదులుకున్న టిజెఎస్ ఇక ఏ సీటును కూడా వదులుకోవడానికి సిద్దంగా లేదని తెలుస్తోంది. కాంగ్రెస్, టిజెఎస్ ఫ్రెండ్లీ పోటి చేస్తారా అనేది తేలాల్సి ఉంది. 

కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన నాలుగో జాబితాలో సీట్లు పొందిన వారు

 1) సికింద్రాబాద్: కాసాని జ్ఞానేశ్వర్

 2) కోరుట్ల: జువ్వాడి నర్సింగరావు

 3) నారాయణఖేడ్: సురేష్ షెట్కార్

  4) నారాయణపేట: వామనగారి కృష్ణ

  5) దేవరకద్ర: పవన్ కుమార్ రెడ్డి

  6) మిర్యాలగూడ: ఆర్. కృష్ణయ్య

మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 94 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. టిడిపి 14, జన సమితి 8, సిపిఐ 3 స్థానాల్లో పోటి చేస్తున్నారు.