తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఏపీలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమాన సంఘాలూ వెలిశాయి. పండుగలు, పబ్బాల సమయంలో కేసీఆర్కు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్లు వెలుస్తాయి. కేక్లు తెగుతాయి. జయజయ ధ్వానాలు మారుమోగుతాయి. ఆయన ఫొటోలకు పాలాభిషేకాలు జరుగుతాయి. ఇది ఏపీలో ఆయనకు ఉన్న క్రేజ్. మన రాష్ట్రంలో కేసీఆర్కు ఉన్న అభిమానుల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఆయన వస్తున్నారంటే ఎయిర్పోర్ట్లో ఆయనకు ఎదురేగి శాలువాలు కప్పేస్తారు. గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. గత ఏడాది అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల వారి పెళ్లికి హాజరైన కేసీఆర్ను టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ రేంజ్లో స్వాగతం పలికారో చూశారు జనాలు. ఆశ్యర్యపోయారు కూడా.
మంత్రి యనమల రామకృష్ణుడు గానీ, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ గానీ కేసీఆర్కు ఎంత చనువుగా మెలిగారో గమనించారు. మొన్నటికి మొన్న కేసీఆర్ విశాఖపట్నానికి వస్తే.. ఎయిర్పోర్ట్ దారి పొడవునా స్వాగత తోరణాలు వెలిశాయి. చంద్రబాబు అనుకూల మీడియా కూడా ఏ రేంజ్లో చెలరేగుతుందనేది కూడా మనం చూశాం.
ఆ విషయానికి వస్తే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ అభిమానులు చాలా తక్కువ. అసలు లేరనే అనుకోవచ్చు. ఎందుకంటే- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి `డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి` పేరుతో ఓ ఐకన్ ఉంది. వైఎస్ను కాదని ఎవర్నీ ఆ పార్టీ అభిమానులు ఆకాశానికి ఎత్తేయరు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల దృష్టిలో వైఎస్ ఒక్కరే దేవుడు. ఇందులో మరో మాటకు అవకాశమే లేదు. టీడీపీ పరిస్థితి అలాక్కాదు. వారికంటూ ఎన్టీఆర్ అనే దేవుడు ఉన్నప్పటికీ.. పేరుకు మాత్రమే. ఎన్టీఆర్ పేరు గానీ, ఫొటో గానీ ఓటు బ్యాంకుగా చూస్తారే తప్ప ఆరాధించరు. అది వేరే విషయం.
తాజాగా చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ సీపీకి దగ్గరైంది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జట్టు కట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తానే స్వయంగా జగన్ ఇంటికి వెళ్లారు. అక్కడే భోజనం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ఈ విషయం తెలుగుదేశంలో ప్రకంపనలు రేపుతోంది. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీ, ఏపీలోని ప్రతిపక్ష పార్టీతో కలిస్తే.. టీడీపీలో కలకలం చెలరేగడం ఆశ్చర్యకరమేమీ కాదు.
ఎందుకంటే- తమ నాయకుడిని ఛీ కొట్టిన టీఆర్ఎస్ అధినేత.. ప్రత్యర్థి ఇంటికి వెతుక్కుంటూ మరీ వెళ్లడమనేది టీడీపీ నేతలకు మింగుడు పడట్లేదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలంటే తమ నాయకుడే తిప్పాలని, అది తమ పేటెంట్ అని భ్రమ టీడీపీ నేతల్లో ఉంది. మరొకరికి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడాన్ని, ఆ `మరొకరు` అనే వ్యక్తి తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ శ్రేణులు.
రాష్ట్రాన్ని విభజించిన టీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు బుద్ధా వెంకన్న వంటి అగ్ర శ్రేణి నాయకులు. రాష్ట్రాన్ని విభజించిన అదే టీఆర్ఎస్తో పొత్తు కోసం తమ అధినేత చంద్రబాబు వెంపర్లాడిన విషయాన్ని విస్మరించకపోయి ఉండవచ్చు. పోనీ- టీఆర్ఎస్ రాష్ట్ర విభజనకు కారణమైందనే అనుకుందాం. విభజనకు చట్టం చేసిన కాంగ్రెస్ పంచన చేరడాన్ని తెలుగుదేశం నాయకులు ఎలా సమర్థించుకుంటారు? మొన్నటిదాకా బూతులు తిట్టిన కాంగ్రెస్నే ఇప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగాల్సిన అత్యంత దుర్భర పరిస్థితిని వాళ్లు ఎలా భరిస్తున్నారు?
త్వరలో కేసీఆర్ ఏపీకి వస్తారని, తనతో మరింత కూలంకషంగా చర్చిస్తారని జగన్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ రాష్ట్రానికి వస్తే, టీడీపీ నేతలు ఎలా ప్రవర్తిస్తారు? ఆయన ఏపీలో అడుగు పెట్టడమే మహాద్భాగ్యంగా భావించే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఈ సారి కేసీఆర్ వస్తే ఎలా స్వాగతిస్తారు. ఎప్పట్లాగే బ్యానర్లు కడతారా?
లేదూ! కేసీఆర్ రాష్ట్రానికి వస్తుంటే `చచ్చామో, బతికామో చూడ్డానికి వస్తున్నారా..` అనే తమ `బ్రాండ్` డైలాగ్ను వదులుతారా? అనేది ఆసక్తికరమే. ఏది ఏమైనప్పటికీ.. చంద్రబాబును కేసీఆర్ వద్దనుకున్నారు. చంద్రబాబు తన వెంట ఉంటే నష్టమే తప్ప లాభమేమీ లేదని తీర్మానించుకున్న తరువాతే ఆయన జగన్ వైపు మొగ్గు చూపారు.
