కాపు ముఖ్యమంత్రి.! వైఎస్ జగన్ ఆందోళన చెందుతున్నారా.?

‘తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమ సమయంలో నినదించిన సంగతి తెలిసిందే.

రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చే హామీలకు కట్టుబడి వుండరనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? తెలంగాణ రాజకీయాల్ని పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘కాపు ముఖ్యమంత్రి’ అనే సెంటిమెంట్ క్రమంగా బలపడుతోంది.

‘కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల కంటే మా జనాభా ఎక్కువ.. మా ఓటు బ్యాంకు రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది. మేమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?’ అని కాపు సామాజిక వర్గం అంటోంది. ఒక్క కాపు సామాజిక వర్గమే ఏకతాటిపైకి వస్తే, ఉపయోగం వుండదు.

అందుకే, ‘కాపు సామాజిక వర్గం, బీసీలు, ఎస్సీ ఎస్టీలు కలిసి..’ అంటున్నారు కాపు సామాజిక వర్గ ప్రముఖులు. ఈ విషయమై వైసీపీలోని కాపు సామాజిక వర్గంలోనూ అలజడి బయల్దేరింది. ఒకవేళ వైసీపీకి వ్యతిరేకంగా కాపులు ఏకతాటిపైకి వస్తే, ‘కాపు సామాజిక వర్గంలో ద్రోహులుగా మిగిలిపోతాం’ అని కొందరు వైసీపీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారట.

విషయం వైసీపీ అధినాయకత్వం వరకూ వెళ్ళింది. దాంతో, కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు అధినేత వైఎస్ జగన్ వ్యూహ రచన చేస్తున్నారట. సంక్రాంతి తర్వాత కాపు సామాజిక వర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక వరాల జల్లు కురిపిస్తారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అవేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.