బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జనసేనలోకి మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్

(శివ ప్రసాద్, ఫణికుమార్)

 

మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మనోహర్ రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికే తిరుపతికి బయలుదేరారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు పవన్ తిరుపతికి చేరుకోనున్నారు.  

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్

గతంలోనే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ తో పలుసార్లు భేటి అయ్యారు. విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ పని చేశారు. నాదెండ్ల మనోహర్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. అయితే నాదెండ్ల మనోహర్ తీసుకున్న నిర్ణయంతో అంతా షాక్ కు గురయ్యారు. ఏపిలో కాంగ్రెస్ పుంజుకొని ముందడుగు వేయాలనుకుంటున్న వేళ ఒక కీలకమైన నేత పార్టీని వీడిపోవడంతో కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు.  

కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మనోహర్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కొడుకన్న విషయం అందరికీ తెలిసిందే. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నుండి వరుసగా  2004, 2009 నుండి రెండుసార్లు ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. 2009లో ఎన్నికైనపుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఐదేళ్ళు పనిచేశారు.  ఆయన స్పీకర్ గా ఉన్నపుడే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యింది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. చాలామంది నేతల్లాగా మనోహర్ కూడా చాలా కాలం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో మళ్ళీ యాక్టివ్ అవ్వాలని అనుకున్న మనోహర్ ఏదో పార్టీ తరపున పోటీ  చేయాలని అనుకున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఉపయోగం లేదని అర్ధమైపోవటంతో వైసిపి వైపు చూశారు. జిల్లాలోని నేతలతో చర్చలు కూడా జరిగాయి. పవన్ తో చర్చలు జరిపి ఆయన జనసేనలో చేరారు. తెనాలి నుంచే ఆయన పోటి చేయనున్నారు.