ఆంధ్రప్రదేశ్: కొత్త ఏడాదిలో ముందస్తు ముచ్చట.!

2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి. సార్వత్రిక ఎన్నికలివి. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణలోనూ అలాగే జరగాలిగానీ, కేసీయార్ గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో, ఈ ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. అధికార పార్టీలో ఈ విషయమై కొంత గందరగోళం వుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమే మేలన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. అధినేత వైఎస్ జగన్ కూడా ముందస్తు దిశగా పార్టీ ముఖ్య నేతలకు సంకేతాలు పంపుతున్నారు.

పైకి మాత్రం, ‘మేం ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోం’ అని వైసీపీ చెబుతోంది. విపక్షాలకు షాక్ ఇవ్వాలంటే, అవి కుదురుకునేలోపే ముందస్తు ఎన్నికలకు అధికార పక్షం వెళ్ళాల్సి వుంటుంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో యాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వీటిల్లో జనసేన పార్టీ వచ్చే ఎన్నికల కోసం అస్సలేమాత్రం సన్నద్ధం కాలేదు. టీడీపీలో కూడా అభ్యర్థుల కొరత వుంది.

ఈ టైమ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళితే, సమీప భవిష్యత్తులో విపక్షాలు కోలుకునే అవకాశం వుండదన్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహమట. అయితే, ఎప్పుడు ముందస్తుకు వెళ్ళాలన్నదానిపైనే కొంత గందరగోళం నడుస్తోంది అధికార వైసీపీలో. ఏప్రిల్ తర్వాత వైఎస్ జగన్ ముందస్తుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్నది తాజా ఖబర్.