టిఆర్ఎస్ అధినేత తనయుడు, మంత్రి కేటిఆర్ కొత్త ఇరకాటంలో చిక్కుకున్నారు. ఆయన మీద ఏకంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎందుకు కేటిఆర్ ఇరకాటంలో పడ్డారు? ఆయన మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందెవరు? చదవండి.
ఇటీవల మంత్రి కేటిఆర్ సిరిసిల్లలో జరిగిన ఒక సభలో ఆర్ఎంపి లు, పిఎంపి లకు వరాల జల్లు కురిపించారు. ఆర్ఎంపిలు, పిఎంపిలు ఫుల్ గా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రస్తుతం ఉన్న జిఓను సవరిస్తామని వారికి తెలంగాణ సర్కారు పూర్తిగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పనిలో పనిగా కొన్ని రాజకీయ పరమైన కామెంట్స్ కూడా చేశారు.
ఒక్క ఆర్ఎంపి, ఒక్క పిఎంపి సుమారు 500 మందితో టచ్ లో ఉంటారని కేటిఆర్ కామెంట్ చేశారు. కాబట్టి వారి డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. వారికి కమ్యూనిటీ పారా మెడిక్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. అలా ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎంపిలకు సర్టిఫికెట్లు గా ఇస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని ప్రొఫెషనల్ డాక్టర్స్ వాదిస్తున్నారు. గుడ్డిగా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తే వారు చేసే వైద్యం తో జనాల ప్రాణాలకు ముప్పు వాటిల్ల వచ్చని డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
కేటిఆర్ ఆర్ఎంపి, పిఎంపిలకు వరాల జల్లు కురిపిస్తూ వారి చేత ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే కేటిఆర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిిఇఓ రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే డాక్టర్లు కేటిఆర్ తీరును ఎండగట్టారు. జిఓ ను సవరించేందుకు ప్రయత్నం చేస్తానని కేటిఆర్ హామీ ఇవ్వడాన్ని ఈ డాక్టర్స్ సంఘం ఖండించింది.
గ్రామాల్లో, పట్టణాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు మితిమీరిన వైద్యం చేయడం వల్ల అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వారికి మరింత వెసులుబాటు ఇవ్వడం కారణంగా మరిన్ని కష్టాలు తప్పవన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ చేయాల్సిన పనిని ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఆర్ఎంపిలు, పిఎంపిలు చేయడం ఆందోళన కలిగించే అంశంగా తెలిపారు. ప్రిష్కిప్షన్ రాయడానికి కూడా ఆర్ఎంపిలకు అనుమతి లేదని, అలాంటిది రేపటినాడు వారే ఆపరేషన్లు చేసే పరిస్థితి వస్తుందన్నారు.
రాజకీయ పరమైన ప్రయోజనాల కోసం ఆర్ఎంపిలు, పిఎంపిలను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించిన కేటిఆర్ మీద చర్యలు తీసుకోవాలని డాక్టర్ల సంఘం కోరింది. వారి ద్వారా జనాలతో ఓట్లేయించుకునే ప్రయత్నాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమైనవిగా డాక్టర్లు తెలిపారు. తక్షణమే కేటిఆర్ మీద చర్యలు తీసుకోవాలని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు రజత్ కుమార్ కు విన్నవించారు.
ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సీరియస్ గా పరిశీలించకపోతే తాము న్యాయపోరాటానికి దిగనున్నట్లు సంఘం ప్రసిడెంట్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నది. టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పలుమార్లు సీరియస్ అయ్యారు. ఈ పరిణామం కేటిఆర్ ను ఇరకాటంలోకి నెట్టుతుందా? లేదంటే ఎన్నికల సంఘం లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి.
డాక్టర్లు ఎన్నికల సంఘం రాష్ట్ర సిఇఓ రజత్ కుమార్ కు ఇచ్చిన వినతిపత్రం కాపీ కింద ఉంది చూడొచ్చు.