కాంగ్రెస్ టిడిపి హరీష్ ను టార్గెట్ చేసేందుకు కారణం ఇదే…

 

 

టిఆర్ ఎస్ నుంచి హరీష్ రావు ఎగిరిపోతాడా?

(లక్ష్మణ్  విజయ్ కొలనుపాక)

మ‌హకూట‌మి ఏర్పడటం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఏమాత్రం ఇష్టం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఒక్కటే ఒంటరిగాపోటీచేస్తుందని, మహా అయితే, ప్రొఫెసర్ కోదండరామ్ కలుస్తాడని ఆయన భావించారు. అపుడు గెలవడం నల్లేరు మీద నడకే అనుకున్నారు. నిజానికిఒక దశలో తెలుగుదేశం పార్టీ టిఆర్ ఎస్ తో కలుస్తుందని కూడా వార్తలొచ్చాయి. టిఆర్ ఎస్ నుంచి దీనికి సానుకూల స్పందన కూడా వచ్చింది. ఇలాంటిది తెలుగుదేశం పార్టీ ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని కెసియార్ నాలుగయిదు నెలల కిందట దాకా నమ్మలేదు. అయితే, అదే నిజమయింది. ఈ షాక్ తో కెసియార్, కెటియార్, హరీష్ రావు తొలినుంచి ఫౌల్ గేమ్అని అర్చడం మొదలుపెట్టారు.

తెలంగాణ ద్రోహితో కాంగ్రెస్ తో ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ టిడిపితో కలవడంతో కూటమి ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. కాంగ్రెస్ ద్రోహి అన్నారు. చంద్ర బాబే ప్రధాన ప్రత్యర్థి యా అన్నంతగా కెసియార్ కుటుంబ సభ్యులు దాడి చేయడం ప్రారంభించారు. అంతేకాదు, కాంగ్రెస్ తో కోదండరామ్ఎలా కలుస్తారు, నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్ తో కలిసే బదులు అడిగితే మేమే నాలుగు సీట్లి స్తాం కాదా అని కెటియార్ కోదండ రామ్ ని ఎగతాళి చేశారు.

మహాకూటమి ఏర్పడకుండా, కూటమిని అభాసు పాలుచేసేందుకు కెసియార్, కెటియార్, హరీష్ రావు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. తమ దాడితో కూటమి ఏర్పడదనుకున్నారు.ఒక వేళ ఏర్పడిన తమ మాటల మాయతో కూటమి అభాసు పాలవుతుందని, కాంగ్రెస్ టిడిపి తలెత్తుకు తిరగలేరని అనుకున్నారు. అయితే సర్వేలు దీనికి భిన్నంగా కూటమి పుంజుకుంటున్నదని చెబుతున్నాయి.

ఈ ఉత్సాహంతో  టిఆర్ ఎస్ దాడిని  తిప్పికొట్టేందుకు కాంగ్రెస్, టిడిపి పవర్ ఫుల్ ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఈ దాడితో టిఆర్ ఎస్ దిమ్మతిరిగింది.   ఇంత తెలివయిన ఎదురు దాడి ని రూలింగ్ పార్టీ వూహించి ఉండదు. మహాకూటమిని చీల్చే పనిలో టిఆర్ ఎస్ ఉంటే, టిఆర్ ఎస్ ని చీల్చే పనిలో టిడిపి కాంగ్రెస్ లున్నాయి. దీనికి మామ, బావమరదితో అంత మంచి సంబంధాలు లేని హరీష్ రావును ఎంచుకున్నారు.  హరీష్ రావు టిఆర్ ఎస్ ను చీలుస్తున్నాడని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నాడని, తెలంగాణలో ఒక వేళ హంగ్ అసెంబ్లీ వస్తే, టిఆర్ ఎస్ సభ్యులతో హరీష్ వస్తాడని, అపుడు అంతా ఆయననే ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం మొదలుపెట్టారు టిడిపి కాంగ్రెస్ నేతలు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డి , కాంగ్రెస్

పైకి ఎన్ని ప్రకటనలు చేసినా టిఆర్ ఎస్ లో హరీష్ హ్యపీ గా లేడని అందరికి తెలుసు. ఆయనను కాదని కెటిఆర్ ని ముఖ్యమంత్రి ని చేస్తే హరీష్ తిరుగుబాటు చేస్తాడని సర్వత్రా వినబడుతున్నవాదన. ఆ మధ్య కెటిఆర్ కుటుంబం నడిపే ‘నమస్తే తెలంగాణ’ లో హరీష్ వార్తలను బంద్ చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి కాంగ్రెస్ లు హరీష్ రావు మీద చేస్తున్న ప్రచారాన్ని చాలా మంది నమ్మే అవకాశం ఉంది. ఈ వ్యూహం ఇంత బలంగా తాకుతుందని టిఆర్ ఎస్ త్రిమూర్తులు వూహించి ఉండరు. భాష భావం,రాజకీయాలు తమసొత్తు అనుకుంటున్న టిఆర్ ఎస్ పార్టీకి టిడిపి కాంగ్రెస్ కౌంటర్ వ్యూహం పెద్ద షాక్.

తెలంగాణ వచ్చాక తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బతక లేదు కాబట్టి టిఆర్ ఎస్ తో కలవడమో, కలసి పోవడమో మార్గమని అనుకున్నారు. దానికి తోడు మోత్కుపల్లి నరసింహులు లాంటి సీనియర్ టిడిపి నాయకుడు కూడా టిడిపి టిఆర్ సి వీలీనం కావాలని బాగా రభస సృష్టించారు. ఇలాంటి టిడిపి ఇపుడు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రధాన పార్టీ అయిపోతున్నది. మాయమయిన పార్టీ ఉన్నట్లుండి తెలంగాణలో మూడో పెద్ద పార్టీ అయింది. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ జనసమితికంటే టిడిపియే పెద్ద పార్టీ అని నమ్ముతున్నది. అందుకే ఎక్కువ సీట్లు టిడిపికే ఇస్తున్నది. చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తుగడలో దిట్ట. ఆంధ్రలో రూలింగ్ లో ఉన్న చంద్రబాబుకు ధనబలం కొదువ లేదు. ఆయనకు తెలంగాణలో బాగానే జనబలం ఉంది. అందుకే టి డిపి , కాంగ్రెస్ (కోదండరామ్ గురించి టిఆర్ ఎస్ కు భయం లేదు) కాంబినేషన్ ప్రమాదకరమయిందని టిఆర్ ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతూ ఉన్నది స్పష్టం.

రేవూరి ప్రకాశ్ రెడ్డి టిిడిపి

టిడిపి కాంగ్రెస్ పార్టీలు హరీష్ రావును పావుగా వాడుకోవాలనుకోవడం చాలా గొప్ప రాజకీయ ఎత్తుగడ. ఈ దాడిని రెడ్ల తో చేయించడం  వల్ల, ఇద్దరు గౌరవ ప్రదమయిన రెడ్లు ఈ దాడికి పూనుకోవడం వల్ల దీనికి బాగా ప్రచారం వచ్చింది. నిజమో కాదో హరీష్ రావును టిఆర్ ఎస్ లో తొక్కేస్తున్నారని జనమంతా నమ్ముతున్నారు. ఇది గత మూడేళ్లుగా చర్చల్లో ఉన్నదే. అందుకే ప్రజల్లో హరీష్ మీద చాలా సానుభూతి ఉంది. కెటిఆర్ గ్లామర్ బోయ్ అయితే హరీష్ రావు గ్రామాల నేత. గ్రామీణ స్థాయి కార్యకర్తలను, సానుభూతి పరులను కన్ ఫ్యూజ్ చేసేందుకు టిడిపి కాంగ్రెస్ కు హరీష్ అనువైయిన అయుధం. ఈ క్యాంపెయిన్ టాగ్ లైన్  కాబోయే ముఖ్యమంత్రి హరీష్ రావే అని రాసుకున్నాయి.

కెసియార్ వ్యవహార శైలి వల్ల చాలా మంది నేతలకు లోలోన ఆయనంటే సరిపోదు. ఎందుకంటే, ఆయన్ని కలువడం, ఏదయినా చర్చించడం, సాయం కోరడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆయనకూడా ఎవ్వరినీ లెక్క చేయరు. ఈ వైరుధ్యం బయటకు కనిపించదు. ఎందుకంటే, టిఆర్ ఎస్ టికెట్ లేకపోతే గెలవలేమని భయం. అందుకే ఎవరూ పైకి పల్లెత్తు మాట అనరు. ఇలాంటి వాళ్లంతా రేపు హరీష్ రావు తిరుగుబాటు చేస్తే పోలోమని ఆయన వెంబడి వస్తారని చాలా మంది నమ్మకం. పార్టీలోని కొన్ని వర్గాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో ఉన్న ఈ అపోహని కాంగ్రెస్ టిడిపి అస్త్రంగా కెసియార్ మీద ప్రయోగిస్తున్నాయి. హరీష్ రావు అంటే ప్రజల్లో అనుమానం  బలపడేలా  మైండ్ గేమ్ అడుతున్నాయి. ఇందులో విజయవంతమయ్యాయికూడా. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో టిడిపి, కాంగ్రెస్ లు సోషల్ మీడియాలో బాగా చొచ్చుకు పోయాయి. తెలంగాణలో పత్రికలు కెసియార్ కు వ్యతిరేకంగా రాయడం మానేసి చాలా కాలమయింది. అక్కడ అడ్వర్టయిజ్ మెంట్ల విందు నడుస్తూ ఉంది.  పేరున్న కొందరు ప్రింటు జర్నలిస్టులు టిఆర్ ఎస్ నేతల ట్వీట్లను రీట్వీట్ చేసే పనిలో పడిపోయారు. మేధావి జర్నలిస్టులు కెసియార్ విలేకరుల సమావేశంలో ముందు వరసలో కూర్చుని కేసియార్ చూపు తమ మీద ఎపుడు పడుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అందుకే టిడిపి, కాంగ్రెస్ లు తమ ఎత్తుగడని సోషల్ మీడియా నుంచి ఫిరంగిలా పేల్చాయి.

టిఆర్ ఎస్ చీలడం గ్యారంటీ అని, అది హరీష్ రావు నాయకత్వంలో జరుగుతుందనే బలమయిన మెసేజ్ ను ప్రతిపక్ష పార్టీలు పంపడంలో విజయవంతమయ్యాయి. దీనితో హరీష్ రావు డిఫెన్స్ లో పడిపోయారు. రోజుకూ మూడుపూటలా ‘నేను కొనవూపిరిదాకా టిఆర్ ఎస్ లోనే ఉంటా, కెసియారే మా నాయకుడు, ఆయనకు అఖండవిజయం సాధిస్తా,’ అని వివరణ ఇచ్చుకోవలసి వస్తున్నది. అంతేకాదు, ఈ డిఫెన్స్ లోకి మరొక మాటకారి, హరీష్ కు ప్రచ్ఛన్న ప్రత్యర్థి అయిన కెటియార్ కూడా దిగారు. ఆయన కూడా ‘హరీష్ టిఆర్ ఎస్ లోనే ఉంటారు. మా మధ్య విభేదాలు లేవు. మేం చాలా దగ్గిర. కాంగ్రెస్ టిడిపిలు డ్రామాలాడుతున్నాయి,’అని అంటున్నారు. రాజకీయాలంటే డ్రామాలే. అదెవరాడినా డ్రామాయే.

గజ్వేల్ లో ముఖ్యమంత్రి కెసియార్ మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ దాడిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఆయన దాడితో తెలంగాణ ఒక్కసారి ఉలిక్కి పడింది. తెలంగాణ ఎన్నికల ప్రచారం కొత్త మలుపు తిరిగింది. ఆయన హరీష్ గురించి చెప్పి న తీరు నమ్మశక్యంగా ఉంది…రిపీట్ నమ్మ శక్యంగా ఉంది.

‘ముఖ్యమంత్రి కెసియార్ ను ఓడించేందుకు, మంత్రి హ‌రీష్ రావు స‌పోర్ట్ కూడ కాంగ్రెస్ కు ఉంది. హ‌రీష్ నాకు ఒక ప్రైవేట్ నెంబ‌ర్ నుంచి ఫోన్ చేసి చాలా ముఖ్యమమయిన విషయాలు చెప్పారు,’ అని అనడం టిడిపి- కాంగ్రెస్ క్యాంపెయిన్ లో టర్నింగ్ పాయింట్. దీన్ని సోషల్ మీడియా విపరీతంగా షేర్ చేసి అన్ని మూలలకు చేరవేసింది.

ఒంటేరు సీరియస్ పొలిటిషన్. అంతేకాదు, కొండతో ఢీకొనడంలో ఆనందం చూసుకునే చిత్రమయిన నేత. టిడిపి నుంచి ఈ మధ్యే కాంగ్రెస్ కు వచ్చాడు. ఒంటరు అబద్దం చెప్పడనే చర్చ కూడా మొదలయింది. అందుకే, ఇది తప్పని ఖండించేందుకు హరీష్ స్వయంగా రంగంలోకి దిగి మంటలార్పడం మొదలుపెట్టారు. గజ్వేల్ లో గెలవడం కష్టమనే ఒంటేరు ఈ అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని, తన ప్రాణం ఉన్నంత వ‌ర‌కు టీఆర్ఎస్‌ని గాని, మామ కెసియార్ ను గాని వదిలేది లేదని చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేత‌లు బ‌ట్టకాల్చి మీదేసే ప్రయ‌త్నం చేస్తున్నారని హ‌రీష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీని మీద న్యాయ పోరాటం చేస్తానని ఒంటేరును జైలుకి పంపిస్తానని గజ్వేల్లో డిపాజిట్లు రాకుండా చేస్తానని …మంచివాడని పేరున్న హరీష్ రావు చాలా చాలా చాలా చెప్పి టిఆర్ ఎస్ నాయకత్వాన్ని, ప్రజలనునమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

రెండవ వ్యవూత్మక దాడి ఈ సారి టీడిపి సీనియ‌ర్ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డి నుంచి ఎదురయింది. ఒంటేరు మొదలుపెట్టిన యుద్ధాన్ని ఆయన చాలా ముందుకు తీసుకెళ్లారు. విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని, హ‌రీష్ సీఎం అవుతార‌ని ప్రకటించారు. ఆయన లాజిక్ ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మ‌హాకూట‌మికి స‌మానంగా సీట్లు వ‌స్తాయి. హంగ్ హౌస్ వస్తుంది. అప్పుడు హ‌రీష్‌తో పాటూ చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయ‌ట‌కొస్తారు. అపుడు ఆయననే సిఎం చేసే అవకాశం ఉంది.

‘‘హ‌రీష్ రావే నిజమయిన రాజకీయనాయకుడు . మామ పోరు వల్ల టిఆర్ ఎస్ లో ఆయన ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ు, వ‌చ్చే నెల‌రోజుల్లోనే హరీష్ రావుకు విముక్తి,’ అని రేవూరి బాంబ్ షెల్ వేశారు.

 

కాంగ్రెస్, టిడిపి నేత‌లు టీఆర్ఎస్‌నే దెబ్బకొట్టేందుకు పన్నిన ఈ వ్యూహం రాష్ట్రమంతా అంటుకుంది.
టీఆర్ఎస్‌ ఎంత డిఫెన్స్ లో పడిపోయిందంటే, మహాకూటమిని విమర్శించడం తగ్గించి, హరీష్ ను కాపాడుకునే పనిలో పడిపోయింది. టిఆర్ ఎస్ను ఎదుర్కోలేకే ఇలా పార్టీకి చెందిన ఒక కీల‌క నాయకుడిని టార్గెట్ చేశార‌ని టిఆర్ ఎస్ నేతలుంటున్నారు. హ‌రీష్ ని వివాదాలంలోకి తీసుకొస్తే ప్రజలు నమ్ముతారని, అపుడు పింక్ పార్టీలో అల‌జ‌డి రేపొచ్చని ప్రతిప‌క్షా లు కుట్ర చేస్తున్నాయని వారంటున్నారు. పార్టీ క్యాడర్ లో, సానుభూతిపరుల్లో విశ్వాసం పట్టుసడలకుండా ఉండేందుకు టిఆర్ ఎస్ కు 100 సీట్లొస్తాయనే ప్రచారం చేస్తున్నారు.