ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక రాజకీయ వ్యూహాన్ని అమలుపరచేందుకు అడుగులు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గతంలో అంబేడ్కర్ పేరుతో అమలైన ఈ పథకాన్ని వైసీపీ హయాంలో జగన్ తన పేరుతో మార్చడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే పథకాన్ని తిరిగి అంబేడ్కర్ పేరుతో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ కొత్త పాలనలో ఈ పథకానికి నూతన ఊపును అందించేందుకు రూ.25 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మంజూరు చేయనున్నారు. అలాగే బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులకు రూ.10 లక్షలు మంజూరవుతాయి. ఈ సహాయం అందేందుకు విద్యార్థులు ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినట్టు ఆధారాలు చూపించాలి.
ఈ విధంగా వర్గాల వారీగా నిధులను ప్రత్యేకించి, అంబేడ్కర్ పేరును తిరిగి ఉపయోగించడమంటే.. ఓటు బ్యాంకులను ఆకర్షించేందుకు తెలివైన రాజకీయ ప్రయోగంగా భావిస్తున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలో దూరమైన ఎస్సీ, ఎస్టీ ఓటర్లను మళ్లీ ఆకర్షించే ప్రయత్నంగా చూస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి, పరిశుభ్రతపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు సామాజిక న్యాయం కూడా సమర్థంగా అమలు చేస్తున్నట్టు ఈ పథకం ద్వారా సంకేతాలిస్తుండటం గమనార్హం. ఇది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.