నేను కేసీఆర్ భాషలో మాట్లాడను: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల సీఎం ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నల్గొండ సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కెసిఆర్ నిప్పులు చెరిగారు. టీఆరెస్ ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మోడీ, కెసిఆర్ ఒక్కటయ్యారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కెసిఆర్. నేను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి అంటూ చురకలు అంటించారు. కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నలభయేళ్ల రాజకీయాల్లో హుందాగా ఉన్న వ్యక్తిత్వం నాది అన్నారు. పరుష పదజాలం వాడటం నా వ్యక్తిత్వం కాదన్నారు.

నేను హైదరాబాద్ ని డెవలప్ చేయడం తప్పా? నేను బాబ్లీ కోసం పోరాడటం తప్పా? నేను ఈరోజు ఇంకొక స్టేట్ ని డెవలప్ చేయాలి అనుకుంటుంటే మీరు బీజేపీ డైరెక్షన్లో నా మీద ఎటాక్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం? నేను పరుషపదజాలంతో మాట్లాడాను. అది నా సభ్యత కాదు. నేను చేసే విమర్శల్లో కూడా హుందాతనం ఉంటుంది. డిగ్నిటీ ఉంటుంది. తెలుగువారందరూ ఆలోచించాలి నేను చేసిన తప్పేమిటి అని. ఇద్దరూ కలిసి ఉండాలి అని చెప్పడం నా తప్పా? హైదరాబాద్ ని డెవలప్ చేయడం నా తప్పా? నరేంద్ర మోడీని డిమాండ్ చేయడం నా తప్పా? ఈ రాష్ట్రానికి న్యాయం చేయండి. విభజన హామీలు అమలు చేయండి అని డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. మీరు మాటలు మారుస్తూ ఉన్నారు కానీ నేను మొదటి నుండి ఒకేలా ఉన్నాను. రెండు రాష్ట్రాల్లోని ప్రజలే దీని గురించి నిర్ణయించాలి అని చంద్రబాబు అన్నారు.

టీఆరెస్, జనసేన, వైసీపీ… బీజేపీ తో కలిసిపోయాయి కానీ బయటకి నాటకాలు ఆడుతున్నారన్నారు. మేము బీజేపీ తో కలిసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, జగన్ స్పెషల్ స్టేటస్ కోసం డిమాండ్ చేసారు, నన్ను ప్రశ్నించారు. నేను బీజేపీ నుండి బయటకి రాగానే వీళ్లంతా యూటర్న్ తీసుకున్నారు. అప్పటి వరకు స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేసిన వీరు సడన్ గా ఎందుకు ఆ అంశం వదిలేసారు? మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చెయ్యట్లేదు, బయటకి రండి, ఫైట్ చేయండి అంటూ నన్ను డిమాండ్ చేసినవాళ్లు ఇప్పుడు ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడట్లేదు అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంటే మీరు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదని పవన్, జగన్ ని ప్రశ్నించారు బాబు. ఇవన్నీ లాలూచి రాజకీయాలు కావా అంటూ నిలదీశారు.