కేరళకు ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం

కేరళకు తనవంతు భారీ సహాయాన్ని అందించటానికి ముందుకొచ్చారు కేఎంసీ కంస్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. తమ సంస్థ తరఫునుండి వ్యక్తిగతంగా కేరళ వరద బాధితుల సహాయార్ధం కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఈ నెల 28 లేదా 29 తేదీల్లో కేరళ వెళ్లి సీఎం పినరయి విజయన్ ని కలిసి స్వయంగా చెక్ అందించనున్నట్టు వెల్లడించారు గౌతమ్ రెడ్డి. వరద బాధితుల పునరావాసం కోసం,ఇతర కార్యక్రమాల కోసం ఈ డబ్బుని వినియోగించమని సీఎంని కోరనున్నామని తెలిపారు.

కాగా ఇదివరకే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరపున కేరళ వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి కూడా అదే స్థాయి విరాళాన్ని ప్రకటించటం విశేషం. గౌతమ్ రెడ్డి అనుచరులు, వైసీపీ అభిమానులు గౌతమ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కేరళలో పునరుద్ధరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వర్షాలు నిలిచిపోయి నాలుగు రోజులు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో నీళ్లు అలానే నిలిచిపోయాయి. సహాయక శిబిరాల నుండి ఇళ్లకు చేరుకుంటున్నారు ప్రజలు. అయితే ఇళ్లకు వెళుతున్న ప్రజలకు విష సర్పాలు స్వాగతం పలుకుతున్నాయి. ఒక ప్రమాదం నుండి తప్పుకుంటే మరో ప్రమాదం వారిని వెంటాడుతోంది. ఈ మేరకు కేరళలో స్నేక్ అలెర్ట్ కూడా ప్రకటించారు అధికారులు.