తెలుగునాట సరికొత్త రాజకీయం.. దేనికి సంకేతం.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, రాజకీయ కుంపట్లు కూడా వేరుపడ్డాయి. తెలంగాణ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఏనాడో జెండా పీకేసింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వున్నా లేనట్టే.! జనసేన పార్టీ అక్కడా లేదు.. ఇక్కడా లేదు.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

తెలంగాణ ఇచ్చిన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యింది. ఈ సందట్లో కాస్తో కూస్తో లాభపడింది బీజేపీనే. తెలంగాణ తెచ్చిన కేసీయార్, తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా అధికారంలోకి వచ్చారు.. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.. ఆ తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణని తీసేసి, భారత్ రాష్ట్ర సమితి అంటున్నారు.

ఇంతకన్నా సువర్ణావకాశం ఇంకేముంటుంది.? అన్నట్టు.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో రాజకీయం షురూ చేశారు. సో, రేపో మాపో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో మళ్ళీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవ్వొచ్చు. లేదూ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ వుంది కాబట్టి, వైఎస్సార్సీపీ ఇంకో ఆలోచన చెయ్యకపోనూవచ్చు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం మళ్ళీ ఒక్కటవుతుందా.? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్ళీ కలుస్తాయా.? ఈ ప్రశ్నల చుట్టూ బోల్డంత చర్చ, బోల్డన్ని విశ్లేషణలు చూస్తున్నాం. ఏమో, గుర్రం ఎగరావచ్చు.! ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతుందని ఎవరైనా ఊహించారా.?

కేంద్రంలో బీజేపీకి ఫుల్ పవర్ వుంది. ఒకవేళ ఉమ్మడి తెలుగు రాష్ట్రం అయితేనే రాజకీయంగా తమకు లాభమని బీజేపీ భావిస్తే.. ఏమో, మళ్ళీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రాన్ని మళ్ళీ చూస్తామేమో.!