9 కోట్లు నష్ఠపరిహారం కట్టలేకే..రాజీకి వచ్చాడు

వివాదం వదిలి స్టార్ కమెడియన్ వడివేలు ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. అగ్రిమెంట్‌కు విరుద్ధంగా ప్రవర్తించి నిర్మాతల్ని నష్టాల్లో ముంచెత్తిన ఆయన కాళ్ళబేరానికి వచ్చాడని తెలుస్తోంది. తమిళ దర్శకుడు చింబుదేవన్ దర్శకత్వంలో ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సిన ‘ఇంసై అరసన్ 24 పులకేశి’ చిత్రానికి కమిటైన ప్రధాన పాత్రధారి వడివేలు ఆ సినిమాకు చేయననటంతో విషయం నడిగర్ సంఘం వరకూ వెళ్ళింది. చాలా రోజులగా ఈ వివాదం ముగింపు లేకుండా నడుస్తూనే ఉంది. చివరకు వడివేలు దిగి రావడంతో సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది.

తమిళ దర్శకుడు శంకర్ నిర్మాణంలో వడివేలు హీరోగా దర్శకుడు చింబుదేవన్ తీసిన ‘హింసించేరాజు 23వ పులకేసి’ తమిళంలో అప్పట్లో బ్లాక్ బస్టర్ . తెలుగులోనూ విడుదలై యావరేజ్ అయ్యింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘24వ పులకేసి’ సినిమా తీయాలని శంకర్-చింబు దేవన్ భావించారు.

ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి షూటింగుకి రెడీ చేసుకున్నాక వడివేలు గొడవపడ్డాడు. శంకర్, దర్శకుడు చింబు దేవన్‌తో అభిప్రాయభేదాలతో వడివేలు ఈ సినిమా చేయడానికి నిరాకరించాడు. అలాగని తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇవ్వలేదు. దాంతో వడివేలు వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది శంకర్ కు. ఈ విషయమై శంకర్ …నడిగర్ సంఘం,నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు.

అయితే రెండు సంఘాల పెద్దలూ వడివేలుదే తప్పని తీర్పు చెప్పారు. దాంతో ఈ వివాద విషయమై వడివేలును నిషేధించడం వరకూ వెళ్ళింది. అయినాసరే వడివేలు కొండ దిగలేదు. అయితే హఠాత్తుగా … ఏం జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడు వడివేలు సినిమా పూర్తి చేస్తానని ముందుకు వచ్చాడు. శంకర్, చింబుదేవన్‌తో సమావేశమై సినిమా చేయడానికి అంగీకరించాడట.

అందుకు కారణం తనపై బ్యాన్ పెడితే…. ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడతానని భయపడే అంటున్నారు.శంకర్‌ తన చిత్రాన్ని పూర్తి చేయకపోతే తాను ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ. 9 కోట్లను వడివేలు తనకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీన్ని నిర్మాతల సంఘం దృఢ పరచడంతో వడివేలు షాక్‌ అయ్యాడు.

అంతేకాకుండా నష్టపరిహారం కింద చాలా మొత్తం ఇచ్చుకోవడం కూడా సాధ్యం కాదని భావించే వడివేలు దిగి వచ్చాడని అంటున్నారు. వచ్చే దీపావళికి రిలీజ్ అనుకుంటున్న ’24వ పులకేశి’కి వడివేలు ఇక ఏ గొడవలు పెట్టకుండా సినిమా పూర్తి చేస్తే బాగుంటుందని అంటున్నారు.