మీకు గుర్తుందా లేదో ..అప్పట్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ‘కోబలి’అనే సినిమా చేద్దామనుకున్నారు. ‘కోబలి’ కూడా ఫ్యాక్షనిజం కథే. దాంతో రేపు విడుదల అవుతున్న ‘అరవింద సమేత’లో ఆ పాయింట్స్ ఏమైనా కనిపిస్తాయా? అనే సందేహం అందరికీ కలుగుతోంది. ఇదే విషయాన్ని మీడియావారు త్రివిక్రమ్ దగ్గర ఉంచితే..ఆ కథ కోసం చేసిన రీసెర్చ్ ఈ సినిమాకు ఉపయోగపడుతోందని చెప్పారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ…పవన్ తో చేద్దామనుకున్న‘కోబలి’ పూర్తిగా వేరే కథ. దాన్ని ఓ ప్యారలల్ చిత్రంగా చేద్దామనుకున్నాం. పాటల్లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ‘రా’గా చేద్దామనుకున్నాం. అయితే ఆ సినిమా కోసం చేసిన రీసెర్చ్ కొంత ‘అరవింద’కు ఉపయోగ పడింది. అప్పట్లో రాయలసీమ కవిత్వం చదివాను. ‘హంపి నుంచి హరప్పా దాకా’ లాంటి పుస్తకాలు చదవటం జరిగింది. అదంతా ‘అరవింద’ కథకు దోహదం చేశాయి అంటూ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. పూజాహెగ్డే, ఈషా కథానాయికలు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో ఎన్టీఆర్ డైలాగులు చెప్పబోతున్నారు. అలాగే తెరపై సిక్స్ ప్యాక్ తో సందడి చేయబోతున్నారు. అందుకోసం ఆయన చాలా రోజుల పాటు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేసిన విషయం తెలిసిందే. దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్.ఎస్.రాధాకృష్ణ నిర్మాత.

