సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీలు …సామాన్యజనం దగ్గరకు వచ్చేసారు. అప్పట్లో ఓ హీరోతో మాట్లాడాలన్నా, కలవాలన్నా చాలా కష్టంగా ఉండేది. షూటింగ్ స్పాట్ కు వెళ్లి కలిసొచ్చేవారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని..వారితో లైవ్ ఉన్నట్లుగా జనం ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. స్టార్స్ కూడా కోరుకుంటోంది అదే.
ఖచ్చితంగా జనాలకు దగ్గరగా ఉండటం వల్ల వారేం తమనుంచి ఆశిస్తున్నారో తెలుస్తుందని గమనిస్తున్నారు. అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు వివాదాస్పద విషయాలపై కూడా మాట్లాడాల్సిన పరిస్దితి ఏర్పడుతోంది. తాజాగా మంచు మనోజ్, రామ్ చరణ్ ని ఇద్దరిని శబరిమలైపై నోరు విప్పమంటూ ఓ నెట్ జెన్ కోరారు.
శబరిమలకు మహిళల్ని అనుమతించడాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా కేరళ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం గురించి ఎందరో సినీ ప్రముఖులు కూడా స్పందించారు. కాగా సినీ నటులు మంచు మనోజ్, రామ్చరణ్.. అయ్యప్ప మాలను ధరించినప్పటికీ శబరిమల సమస్య గురించి స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది.
దాంతో వీరిద్దరూ మాలలో ఉన్న ఫొటోలను శివాని అనే నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ మనోజ్ను ట్యాగ్ చేసారు ఒకామె.‘శబరిమల గురించి స్వామి దీక్షలో ఉన్న మంచు మనోజ్, రామ్చరణ్ ఎందుకు స్పందించలేదు’ అని ఆమె ప్రశ్నించింది. ‘మనోజ్, రామ్చరణ్..ఇకనైనా మీరు శబరిమల విషయంపై నోరు విప్పండి’ అని కోరారు.
ఈ విషయమై మనోజ్ స్పందిస్తూ..‘పేదలకు తిండి, నీరు, చదువు వంటి సౌకర్యాలు అందడంలేదని మేమంతా చింతిస్తున్నాం. మనం ముందు వారి గురించి ఆలోచించాలి. మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా…అలాంటప్పుడు ఆయనకు వచ్చిన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు. మనమంతా మానవత్వంవైపు నిలబడదాం. లవ్యూ ఆల్’ అని సమాధానమిచ్చారు. రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకూ ఈ విషయమై స్పందన లేదు.