`ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ తో పూరీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ సక్సెస్ నేపథ్యంలో పూరి తన మనసులో దాగి ఉన్న కలతల్ని- వెతల్ని ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతూనే ఉన్నారు. తాజాగా ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో పూరి చెప్పిన కొన్ని సంగతులు షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
ఈ ఇంటర్వ్యూలో పూరి తనదైన శైలిలో ఎక్కడా సుత్తి లేకుండా పాయింట్ కి వచ్చేశాడు. తనకు సక్సెస్ లేని టైమ్ లో ఎందరో ముఖం చాటేశారని అంగీకరించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనపై వచ్చిన వార్తలపైనా ఎంతో ఆవేదన కనబరిచారు. ఇష్టానుసారం రాసేస్తే తమ ఇళ్లలో ఏడుస్తారని కూడా పూరి అన్నారు. తన భార్య ఏడుస్తుంటే ఎన్నోసార్లు చూశానని.. ఇలా ఎందరో హీరోయిన్లకు జరుగుతోందని కూడా పూరి తెలిపారు. ఛార్మితో ఎఫైర్ వార్తలు.. డ్రగ్స్ వ్యవహారంలోనూ పూరి పై జరిగిన ప్రచారానికి అతడు చాలానే నొచ్చుకున్నారని.. కలతకు గురయ్యారని అతడి మాటల్ని బట్టి అర్థమైంది. ఎలా పడితే అలా రాసేస్తారు సోషల్ మీడియాలో. వాళ్లకు అసలు పనే ఉండదు. ఇదొక్కటే పని. చేయాల్సిన పని చేయరు! అంటూ పరోక్షంగా పంచ్ వేశారు. రాసేయగానే ఏడుస్తుంటారు. అలాగని నాకు పరువు పోయిందని అస్సలు బాధపడను అని పూరి ఆ ఇంటర్వ్యూలో అన్నారు.
తాళి కట్టి 11గం.లకు షూట్ కి జంప్
పూరి లైఫ్ లో సర్వం కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆస్తులన్నీ కోల్పోయి చివరికి పెంపుడు కుక్కలకు తిండి పెట్టలేని పరిస్థితిలో అద్దె కొంపలో ఉన్నానని కూడా పూరి తెలిపారు. ఖాళీ అయిపోతేనే జీవితం విలువ తెలుస్తుందని.. స్నేహం విలువ తెలుస్తుందని వేదాంతం వల్లించారు. కష్టాలు.. ఇబ్బందులు లేకపోతే అసలు లైఫ్ లో కిక్కే ఉండదని పూరి అన్నారు. తన పెళ్లి జరిగిన విధానం గురించి పూరి ఆసక్తికర సంగతి ఒకటి ఓపెన్ గా చెప్పారు. ప్రేమలో ఉన్న తను అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. “ఎర్రగడ్డలో ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాను. నా దగ్గర ఆ టైమ్ లో డబ్బుల్లేవు. యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చింది. హేమ బట్టలు కొంది. వేరొకరు ఎవరో కూల్ డ్రింక్స్ కొన్నారు. అక్కడే తాళి కట్టేసి.. అందరికీ కూల్ డ్రింక్స్ పంచేసి మళ్లీ 11 గంటలకు షూటింగ్ కు వెళ్లిపోయాను“ అని షాకింగ్ మ్యాటర్ ని రివీల్ చేశారు.
