Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో భారత విజయం వెనుక స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ పోషించిన పాత్ర అద్వితీయమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కొనియాడారు. జట్టు యాజమాన్యం అతడిపై ఉంచిన నమ్మకమే భారత్ను గెలిపించిందని ఆయన విశ్లేషించారు.
టోర్నీ ఆరంభంలో అజేయంగా నిలిచిన భారత్, సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఆ క్లిష్ట సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఒక నిర్ణయం టోర్నీ స్వరూపాన్నే మార్చేసింది. ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ను బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు పంపి, సంజు శాంసన్ను ఓపెనర్గా పంపడంపై పాంటింగ్ స్పందించారు.

“సంజు శాంసన్తో ఇన్నింగ్స్ ప్రారంభించడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఒక ఆటగాడికి ‘నిన్ను మేము నమ్ముతున్నాం, ఈ పాత్రకు నువ్వే సరైన వ్యక్తివి’ అని భరోసా ఇస్తే వారు అద్భుతాలు చేస్తారని సంజు నిరూపించాడు. టీమిండియా మేనేజ్మెంట్ అతడికి ఆ వెన్నుదన్నుగా నిలబడబట్టే ఈరోజు ట్రోఫీ భారత్ వశమైంది,” అని పాంటింగ్ పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని సంజు శాంసన్ వృథా చేయలేదు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియాను ఫైనల్ వైపు నడిపించాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై, ఫైనల్లో న్యూజిలాండ్పై (89 పరుగులు) ఆడిన ఇన్నింగ్స్లు హైలైట్గా నిలిచాయి. 5 ఇన్నింగ్స్ల్లో 321 పరుగులు చేసిన సంజు, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కూడా అధిగమించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.

కేవలం టీ20ల్లోనే కాకుండా, గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఈ ప్రపంచకప్ను కూడా గెలుచుకోవడం టీమిండియా ఆధిపత్యానికి నిదర్శనమని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గంభీర్ మార్గదర్శకత్వంలో యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి ఆడుతున్న తీరు అమోఘమని ఆయన ప్రశంసించారు.
ఈ విజయంతో మూడు టీ20 ప్రపంచకప్ టైటిళ్లు (2007, 2024, 2026) గెలిచిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

